ప్రాఫిట్‌ బుకింగ్‌ : నష్టాల్లో మార్కెట్లు

3 Aug, 2017 15:57 IST|Sakshi
ముంబై : మెటల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ స్టాక్స్‌లో లాభాల స్వీకరణ కొనసాగడంతో గురువారం కూడా స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు ఆసియన్‌ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలతో మార్కెట్లు కరెక్షన్‌కు గురయ్యాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా నష్టంలో 32,237 వద్ద, నిఫ్టీ 67.85 పాయింట్ల నష్టంలో 10,013 వద్ద క్లోజయ్యాయి. నేటి మార్కెట్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్పొరేషన్‌లు మేజర్‌ గెయినర్లుగా లాభాలు పండించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇంట్రాడేలో సరికొత్త రికార్డు స్థాయిలను తాకింది. 1.6 శాతం పైకి ఎగిసి, రూ.1655 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది.
 
కాగ, ప్రతికూల ఆసియా మార్కెట్లు, ఆర్‌బీఐ వడ్డీరేటు కోత ప్రభావంతో మార్కెట్లు మార్నింగ్‌ సెషన్‌ నుంచి నష్టాల్లోనే ట్రేడవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి ఆర్‌బీఐ పాలసీ రివ్యూ నేపథ్యంలో పీఎస్‌యూ, ప్రయివేట్‌  బ్యాంకింగ్‌ సెక్టార్‌ షేర్లలో లాభాల స్వీకరణ నెలకొంది. దీంతో నిఫ్టీ బ్యాంకు 300 పాయింట్ల మేర పడిపోయింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 63.65 వద్ద నమోదైంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 108 రూపాయలు నష్టపోయి 28,329 రూపాయలుగా ఉన్నాయి. 
 
మరిన్ని వార్తలు