ఏప్రిల్‌లో సేవలు పేలవం: నికాయ్‌ 

7 May, 2019 01:19 IST|Sakshi

న్యూఢిల్లీ: సేవల రంగం ఏప్రిల్‌లో నీరసించింది. ఇండెక్స్‌ 51గా నమోదయినట్లు నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ తెలియజేసింది. సూచీ ఈ స్థాయికి కిందకు రావడం ఏడు నెలల్లో ఇదే తొలిసారి. కొత్త వ్యాపారాల్లో స్వల్ప పెరుగుదల, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి తాజాగా సేవల రంగం సూచీపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే నికాయ్‌సూచీ 50 పైన కొనసాగితే దానిని వృద్ధిగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ లెక్కన సేవల రంగం వరుసగా 11 నెలల నుంచీ 50 పైనే కొనసాగుతోంది.  

తయారీ కూడా నెమ్మదే...! 
భారత తయారీ రంగం వృద్ధి ఏప్రిల్‌లో నెమ్మదిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనిశ్చితి ప్రభావం ఏప్రిల్‌లో తయారీ రంగంపై కనిపించింది. నికాయ్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ ఏప్రిల్‌లో 51.8గా నమోదయ్యింది. మార్చిలో ఇది 52.6 పాయింట్లు. ఆగస్టు తరువాత ఇంత తక్కువ స్థాయికి (51.8) సూచీ పడిపోవడం ఇదే తొలిసారి. అయితే సూచీ 50పైన పాయింట్లు కొనసాగడం ఇది వరుసగా 21వ నెల.  

సేవలు, తయారీ రెండూ కలిపినా నిరాశే.. 
కాగా సేవలు, తయారీ రంగం రెండూ కలిసిన నికాయ్‌ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ కూడా నిరాశగానే ఉంది. మార్చిలో 52.7 పాయింట్ల వద్ద ఉన్న సూచీ ఏప్రిల్‌లో 51.7కు తగ్గింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జూన్‌ 3 నుంచి 6వ తేదీ మధ్య జరుగనున్న నేపథ్యంలో ఈ తాజా గణాంకాలు వెలువడ్డాయి. 

మరిన్ని వార్తలు