26న బ్యాంకుల సమ్మె

24 Dec, 2018 05:14 IST|Sakshi

ప్రభుత్వ రంగంలోని మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 26న (బుధవారం) సమ్మెకు దిగనున్నారు. ప్రైవేట్‌ బ్యాంకుల ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొననున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనాన్ని వ్యతిరేకించడంతో పాటు వేతనాల పెంపు డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆఫీసర్స్‌ శుక్రవారం ఒక రోజు సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 3.20 లక్షల మంది అధికారులు పాల్గొన్నారు. 

ఈ మూడు బ్యాంకులను విలీనం చేయడం ద్వారా దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకును ఏర్పాటు చేయాలని కేంద్రం సెప్టెంబర్‌లో ప్రతిపాదించింది.  అయితే, ఈ విలీనం వల్ల ఇటు బ్యాంకులకు గానీ అటు కస్టమర్లకు గానీ ఎటువంటి ప్రయోజనం ఉండబోదని, పైగా రెండు వర్గాల ప్రయోజనాలకు ప్రతికూలమేనని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) పేర్కొంది. విలీనాల ద్వారా పెద్ద బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్ని స్తోందని, అయితే మొత్తం ప్రభుత్వ  బ్యాంకులన్నింటినీ కలిపేసినా టాప్‌ 10 గ్లోబల్‌ బ్యాంకుల్లో చోటు దక్కే అవకాశాలు లేవని వ్యాఖ్యానించింది. ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్, ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్, నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ వర్కర్స్‌ తదితర 9 యూనియన్లు.. యూఎఫ్‌బీయూలో భాగం.

మరిన్ని వార్తలు