నీరవ్‌ మోదీతో ముఖేష్‌ అంబానీకి లింక్‌?

16 Feb, 2018 11:01 IST|Sakshi
నీరవ్‌ మోదీతో ముఖేష్‌ కుటుంబానికి సంబంధాలు (ఫైల్‌ ఫోటో)

ఆయన పేరుకి డైమాండ్‌ కింగ్‌. పెద్ద పెద్ద షోరూంలతో కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. కానీ ప్రజల సొమ్మును మాత్రం పీల్చుకుతిన్నారు. అసలు విషయం బయటికి వచ్చేసరికి దేశం విడిచి పోయారు. ఆయనే ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.11,400 కోట్ల మేర కన్నం వేసి, నాకేం సంబంధం లేదన్నటూ న్యూయార్క్‌ వెళ్లిపోయారు. స్కాం బయటికి వచ్చేసరికి, ఆయన విదేశాల్లో ఉన్నారు. ఈ అవినీతి తిమింగలాన్ని పట్టుకోవడానికి సీబీఐ, ఈడీలు తీవ్ర కసరత్తు ప్రారంభించేశాయి. అయితే ఈ డైమాండ్‌ కింగ్‌కు‌, దేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్‌ అంబానీకి సంబంధాలున్నట్టు తెలిసింది. 

బిలీనియర్‌ అంబానీ బ్రదర్ల మేనకోడలు ఇషితా సల్గాంకర్, నీరవ్‌ మోదీ తమ్ముడు నిషాల్‌ మోదీని పెళ్లి చేసుకుంది. ఇలా ఈ రెండు కుటుంబాలకు సంబంధం ఏర్పడింది. నిషాల్‌, ఇషితా పెద్ద సమక్షంలో లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా 2016లో గోవాలో జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్తల నుంచి బాలీవుడు స్టార్ల వరకు అందరూ ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరి ప్రీ-వెడ్డింగ్‌ పార్టీని ముఖేష్‌ అంబానీనే స్వయంగా చేశారు. బంకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన  ప్రాపర్టీ ముంబై యాంటిలియా హౌస్‌లో వీరి ప్రీ-వెడ్డింగ్‌ పార్టీ జరిగింది. 

ఇషితా ప్రముఖ గోవా పారిశ్రామిక వేత్త దత్రాజ్‌ సల్గాంకర్‌ కుమార్తె కావడం విశేషం. అంబానీ కుటుంబానికి, దత్రాజ్‌ కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అంబానీ చెల్లెలు దీప్తి సల్గాంకర్‌ను దత్రాజ్‌ పెళ్లి చేసుకున్నారు. నీరవ్‌ మోదీ తమ్ముడు నిషాల్‌ మోదీ కూడా తన మేనమామ మెహల్‌ చోక్సి నేతృత్వంలో డైమాండ్‌ వ్యాపారమే నిర్వహిస్తున్నారు. గీతాంజలి జెమ్స్‌కు మెహల్‌ చోక్సి యజమాని. నిషాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పీ, పారాగన్‌ జువెల్లరీ ఎల్‌ఎల్‌పీ, పారగన్‌ మెర్కండైజింగ్‌ ఎల్‌ఎల్‌పీ, పంచజన్య డైమాండ్స్‌ ఎల్‌ఎల్‌పీ ఇవన్నీ నీరవ్‌ మోదీకి డిజైన్‌ పార్టనర్లుగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు