నీరవ్‌ మోదీ గుండె పగిలే వార్త

27 Mar, 2019 14:51 IST|Sakshi

నీరవ్‌ మోదీకి చెందిన పలు కళాకృతులను వేలం వేసిన ఐటీ శాఖ

రూ. 16.10 కోట్లు పలికిన రవివర్మ పెయింటింగ్‌

సాక్షి, ముంబై: పీఎన్‌బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డైమండ్‌ వ్యాపారి  నీరవ్‌ మోదీ గుండెలు బద్దలయ్యే వార్త ఇది. దేశం నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారిని గత వారం లండన్‌లో స్కాట్‌లాండ్‌ పోలీసులకు చిక్కి, బెయిల్‌ రాక జైల్లో ఉన్న నీరవ్‌మోదీకి  ఇది నిజంగా షాకింగ్‌ న్యూసే. మోదీకి  చెందిన ఖరీదైన కళాకృతులను ఆదాయ పన్నుశాఖ  వేలం వేసింది.  ముంబైలో  మంగళవారం  నిర్వహించిన ఈ వేలంలో రాజా రవివర్మ పెయింటింగ్‌ ఏకంగా 16.10 కోట్ల రూపాయలకు అమ్ముడు బోయింది. దాదాపు అన్నీ అంచనాకు మించి ధర పలకడం విశేషం.  మొత్తం 54. 84 కోట్ల రూపాయల సొమ్మును త్వరలోనే కోర్టుకు సమర్పించనుంది ఐటీ శాఖ.

173 విలువైన పెయింటింగ్స్, 11 వాహనాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ(ఈడీ)  వేలానికి ముంబై స్పెషల్‌ కోర్టు అనుమతిని పొందాయి. అయితే  కోర్టు ఆదేశాల ప్రకారం... తనకు రావల్సిన రూ.95.91 కోట్ల పన్ను బకాయిలకు సంబంధించి ఐటీ శాఖ 68 పెయింటింగ్స్‌ను వేలం  నిర్వహించగా  సరియైన ధర లభించక 13 అమ్ముడు పోలేదు. 

దాదాపు 100 మంది పాల్గొన్న ఈ వేలంలో జొగెన్ చౌదురీ పెయింటింగ్ రూ.46 లక్షల ధర అమ్ముడయింది. దీనికి రూ.18 లక్షలు విలువ అంచనా వేశారు. ఎఫ్.ఎన్ సౌజా 1955 ఇంక్ ఆన్ పేపర్‌కు రూ.32 లక్షలు పలికింది. అంచనా విలువ రూ.12 లక్షలతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ. వి.ఎస్. గైటోండె 1973 ఆయిల్  పెయింటింగ్‌  ధర ఏకంగా రూ.25.24 కోట్లు.  అలాగే వేలంలో విక్రయమైన పెయింటింగ్స్‌లో కే లక్ష్మాగౌడ్, అక్బర్ పదంసే, రీనా కల్లత్, అతుల్ డోదియా, గుర్‌చరణ్ సింగ్, హెచ్ఏ గాదే వంటి కళాఖండాలు ఉన‍్నట్టు తెలుస్తోంది.

కాగా  ఫ్యుజిటివ్‌  డైమండ్‌ వ్యాపారి  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13వేల కోట్ల  ముంచేసి లండన్‌కు  చెక్కేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీపై సీబీఐ,ఈడీ కేసులను నమోదు చేసింది. అలాగే  పలు ఆస్తులతో పాటు, లగ్జరీ కార్లు, అత్యాధునిక వాహనాలు, విలువైన పెయింటింగ్‌లను కూడా ఎటాచ్‌ చేసింది.  అలాగే మోదీ  పాస్‌పోర్టును రద్దు చేసిన కేంద్రం తిరిగి  అతడిని భారత్‌కు  రప్పించేందుకు  కసరత్తు చేస్తోంది.  ఇందుకు బ్రిటన్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో లండన్‌లో  నీరవ్‌మోదీని అరెస్ట్‌ చేసిన పోలీసులు మార్చి29 వరకు రిమాండ్‌కు తరలించిరు. మరోవైపు ఆయన మొదట బెయిల్‌ పిటీషన్‌ను వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు తిరస్కరించిన నేపథ్యలో రెండోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు మోదీ సిద్ధమవుతున్నాడు. 
 

మరిన్ని వార్తలు