మార్కెట్లోకి నిస్సాన్‌ ‘కిక్స్‌’

23 Jan, 2019 00:09 IST|Sakshi

ధరల శ్రేణి రూ.9.55 – 14.65 లక్షలు

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ నిస్సాన్‌.. ‘కిక్స్‌’ పేరుతో భారత మార్కెట్లో నూతన ఎస్‌యూవీ మోడల్‌ కారును విడుదల చేసింది. ప్రత్యేకించి ఇక్కడి మార్కెట్‌ కోసం రూపొందించిన ఈ కారు పెట్రోల్‌ వేరియంట్‌ లీటరుకు 14.23 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్‌ వేరియంట్‌ 20.45 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. పెట్రోల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.9.55 లక్షలు–రూ.10.95 లక్షలు కాగా, డీజిల్‌ వేరియంట్స్‌ ధరల శ్రేణి రూ.10.85 లక్షలు – రూ.14.65 లక్షలుగా నిర్ణయించింది. ఈ సందర్భంగా నిస్సాన్‌ ఇండియా, ఆఫ్రికా, మధ్యతూర్పు ప్రాంతాల చైర్మన్‌ పెయమన్‌ కార్గర్‌ మాట్లాడుతూ.. ‘భారత రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ కారును డిజైన్‌ చేశాం. ఇక్కడి పరిశోధన, అభివృద్ధి టీం.. జపాన్, అమెరికా, బ్రెజిల్‌ సంస్థలతో కలిసి పనిచేసి ఈ కారును రూపొందించింది. ఎస్‌యూవీ విభాగంలో కిక్స్‌ పూర్తిస్థాయి పోటీనివ్వనుంది.’ అని వ్యాఖ్యానించారు. 

ఈ ఏడాదిలోనే ‘లీఫ్‌’ ఎలక్ట్రిక్‌ కార్‌ 
అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయిస్తోన్న ఎలక్ట్రిక్‌ కార్‌ ‘లీఫ్‌’ను ఈ ఏడాదిలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్లు నిస్సాన్‌ ప్రకటించింది. ఈ కారు విడుదలతోపాటు ఈ–పవర్, హైబ్రిడ్‌ కారు వంటి పర్యావరణ అనుకూల టెక్నాలజీని కూడా ఇక్కడి మార్కెట్‌లోకి తీసుకుని రావాలని యోచిస్తున్నట్లు కార్గర్‌ ఈ సందర్భంగా తెలిపారు. 

మరిన్ని వార్తలు