డాట్సన్ కోసం ప్రత్యేక షోరూమ్‌లు

9 May, 2014 01:06 IST|Sakshi

ఈ ఏడాదే సన్నీలో కొత్త మోడల్  డాట్సన్ గో ప్లస్ కూడా
న్యూఢిల్లీ: నిస్సాన్ కంపెనీ డాట్సన్ బ్రాండ్ కార్ల కోసం ప్రత్యేకమైన షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా కార్ల విడిభాగాల సరఫరా చెయిన్‌ను మరింత మెరుగుపరుస్తున్నామని నిస్సాన్ ఇండియా ప్రెసిడెంట్ కెనిచిరో యోముర చెప్పారు. ఉత్తర భారత్‌లో ఒకటి, పశ్చిమ భారత్‌లో మరొకటి చొప్పున మొత్తం రెండు కొత్త పంపిణి కేంద్రాలను ఏడాది కాలంలో  ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం డాట్సన్ బ్రాండ్ కార్లను దేశవ్యాప్తంగా ఉన్న 130 నిస్సాన్ కార్ల షోరూమ్‌ల్లో విక్రయిస్తున్నామని, భవిష్యత్తులో డాట్సన్ కార్ల విక్రయాల కోసం ప్రత్యేకమైన షోరూమ్‌లను ఏర్పాటుచేయనున్నామని పేర్కొన్నారు. దాదాపు ముప్ఫైఏళ్ల తర్వాత నిస్సాన్ కంపెనీ ఈ ఏడాది మార్చిలో డాట్సన్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. రూ.3.12 లక్షల నుంచి రూ.3.70 లక్షల రేంజ్‌లో ఉన్న డాట్సన్ గో మోడల్‌ను అందిస్తోంది. ఈ ఏడాది 70 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని, 2017, మార్చి కల్లా 300 షోరూమ్‌లు ఏర్పాటు చేయడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఏడాది మధ్య కల్లా మిడ్-సైజ్ సెడాన్ సన్నీను, ఆ తర్వాత డాట్సన్‌లో రెండో మోడల్, డాట్సన్ గో ప్లస్‌ను అందించనున్నామని వివరించారు.

>
మరిన్ని వార్తలు