ఆకాశ్‌, శ్లోకా నిశ్చితార్థం ; తొలి ఆహ్వానం ఎవరికంటే..

7 Jun, 2018 19:23 IST|Sakshi

ముంబై : దేశీ కార్పొరేట్‌ దిగ్గజం ముఖేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ, వజ్రాల వ్యాపారి రసెల్‌ మెహతా కుమార్తె శ్లోకా మెహతాల పెళ్లి గురించి ప్రతి విషయం వైరల్‌గా మారుతుంది. మార్చిలోనే గోవాలో వీరి నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముఖేశ్‌ దంపతులు తమ సన్నిహితులకు గ్రాండ్‌గా పార్టీ కూడా ఇచ్చారు. కాగా వీరి నిశ్చితార్థ వేడుకను అధికారికంగా జూన్‌ 30న ముంబైలోని 39 అట్లామౌంట్‌ రోడ్‌లో జరపనున్నారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్‌ తాజాగా ఇంటర్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

కాగా ముఖేశ్‌ సతీమణి నీతా అంబానీ అతిథులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె... తొలి ఆహ్వాన పత్రికను వినాయకుడి చెంత ఉంచారు. నీతా వెంట చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ కూడా ఉన్నారు. ముఖేశ్‌ కుటుంబంలో ఏ వేడుక జరిగిన ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. గోవా పార్టీ తర్వాత కూడా అకాశ్‌, శ్లోకా జంటతోపాటు అంబానీ కుటుంబసభ్యులు ఈ దేవాలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖేశ్‌ దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ, బిజినెస్‌ టైకూన్‌ అజయ్‌ పిరమల్‌ వారసుడు ఆనంద్‌ పిరమల్‌ నిశ్చితార్థ వేడుక గత నెల 7వ తేదీన ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు