నీతా అంబానీకి సముచిత గౌరవం

21 Jun, 2020 18:38 IST|Sakshi

ప్రతిష్టాత్మక జాబితాలో చోటు

ముంబై : కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన నీతా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్ టౌన్ అండ్ కంట్రీ వెల్లడించిన 2020 సంవత్సరానికి అత్యంత వితరణశీలుల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. కరోనా వైరస్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడంతో పాటు మహమ్మారిపై ముందుండి పోరాడే యోధులకు అవసరమైన సహాయ సహకారాలు అందించారని, భారత్‌లో తొలి కోవిడ్‌-19 ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారని ఈ మ్యాగజైన్‌ నీతా సేవలను కొనియాడింది.

లక్షలాది మంది అన్నార్తులకు భోజనం సమకూర్చడంతో పాటు నీతా అంబానీ పెద్ద సంఖ్యలో పలువురిని తమ వితరణతో ఆదుకున్నారని పేర్కొంది. వైద్యులు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లు, ఎన్‌ 95 మాస్క్‌లను సరఫరా చేశారని గుర్తుచేసింది. ఇక నీతాతో పాటు టిమ్ కుక్, ఆఫ్రా విన్‌ఫ్రే, లారిన్ పావెల్ జాబ్స్, ది లాడర్ ఫ్యామిలీ, మైఖేల్ బ్లూంబర్గ్, లియనార్డో డిపాక్రియో వంటి ప్రముఖులకు టౌన్‌ అండ్‌ కంట్రీ మ్యాగజైన్‌ జాబితాలో స్ధానం లభించింది. భారత్ నుంచి ఈ జాబితాలో కేవలం నీతా ఒక్కరికే చోటుదక్కడం గమనార్హం. కరోనా సంక్షోభంతో ప్రపంచం అల్లాడుతున్న క్రమంలో వీరంతా సాయం చేసేందుకు ముందుకొచ్చారని పేర్కొంది.

సంక్షోభం తలెత్తితే తక్షణ స్పందన : నీతా అంబానీ
సంక్షోభం వచ్చినప్పుడు తక్షణం స్పందించేలా రిలయన్స్ ఫౌండేషన్‌ను తాము తీర్చిదిద్దామని, కోవిడ్-19 సమయంలో తమ సేవలకు అంతర్జాతీయ స్ధాయి గుర్తింపు రావడం గౌరవంగా భావిస్తున్నామని రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ అన్నారు. టౌన్ అండ్ కంట్రీ మ్యాగజైన్‌ టాప్ ఫిలాంత్రఫిస్ట్ జాబితాలో స్థానం దక్కడం సంతోషకరం. ఎప్పుడు ఎలాంటి అవసరం ఎదురైనా తమ ప్రభుత్వానికి,  ప్రజలకు సాయం చేస్తామని చెప్పారు.

చదవండి : నిరుపేద‌ల కోసం ‘రిల‌య‌న్స్’ ముంద‌డుగు

మరిన్ని వార్తలు