న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ కార్ల ధరలకే ఎలక్ట్రిక్ కార్ల ధరలు దిగివస్తాయని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. బ్యాటరీల ధరలు గణనీయంగా తగ్గుతున్నందున భారత్ వీటి వినియోగం దిశగా మార్పుకు సిద్ధంకావాలన్నారు. వచ్చే 3–4 ఏళ్లలో ఇతర ఇంధన ధరల కార్లకే ఎలక్ట్రిక్ కార్ల ధరలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ‘బ్యాటరీ వ్యయం బాగా తగ్గింది. గతంలో 267 అమెరికా డాలర్లుగా ఉన్న కిలోవాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్) ధర ప్రస్తుతం 76 డాలర్లకే లభ్యమవుతోంది. ఈ తగ్గుదల ఆధారంగా వచ్చే 4 ఏళ్లలో ఇతర వాహనాల ధరలకు సరిసమానంగా ఈవీ వాహన ధరలు దిగివస్తాయి’ అని వ్యాఖ్యానించారు.