రూ.50 కోట్లతో ఎన్‌సీఎల్‌ వెకా ప్లాంట్‌ 

14 Feb, 2019 01:12 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యూపీవీసీ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎన్‌సీఎల్‌ వెకా హైదరాబాద్‌ శివారులో ప్లాంట్‌ను ప్రారంభించింది. మెదక్‌ జిల్లా ముచ్చెర్లలోని ఈ ప్లాంట్‌ను బుధవారం తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. 16.8 ఎకరాల్లో రూ.50 కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 18 ఎక్స్‌ట్రూడర్‌ లైన్స్‌ ఉన్నాయని.. డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో వీటి సంఖ్యను 30కి పెంచుతామని ఎన్‌సీఎల్‌ వెకా సీఈఓ అశ్విన్‌ దాట్ల తెలిపారు. 

రూ.200 కోట్ల టర్నోవర్‌.. 
కొత్తగా ప్రారంభించిన ఈ ప్లాంట్‌ ద్వారా 450 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని ఈ సందర్భంగా అశ్విన్‌ తెలిపారు. 1.20 లక్షల చదరపు అడుగుల్లోని ఈ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 24 వేల టన్నుల ప్రొఫైల్స్‌. ఈ ఉత్పత్తులను మన దేశంతో పాటూ మధ్య ప్రాచ్య, ఆఫ్రికా (ఎంఈఏ) మార్కెట్లలో సరఫరా చేస్తామని తెలిపారు. ఎన్‌సీఎల్‌ వెకా కంపెనీ హైదరాబాద్‌కు చెందిన ఎన్‌సీఎల్‌ గ్రూప్, జర్మనీకి చెందిన వెకా జాయింట్‌ వెంచర్‌. యూపీవీసీ విండో మార్కెట్లో ఎన్‌సీఎల్‌ వెకాకు 15 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఏటా 30 శాతం వృద్ధి రేటుతో 2018–19 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రూ.200 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. 

మరిన్ని వార్తలు