బిట్‌కాయిన్‌ స్కామ్‌లో రాజ్‌కుంద్రాకు ఊరట..?

12 Jun, 2018 09:02 IST|Sakshi
శిల్పాశెట్టితో రాజ్‌కుంద్రా (ఫైల్‌ఫోటో)

సాక్షి ,న్యూఢిల్లీ : బిట్‌కాయిన్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ఈ కేసులో ఊరట లభించేలా ఉంది. కేసులో తొలి చార్జ్‌షీట్‌ దాఖలైన క్రమంటో రాజ్‌కుంద్రాకు వ్యతిరేకంగా నిర్థిష్ట ఆధారాలు లభించలేదని విచారణాధికారి, సైబర్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనీషా జెందే స్పష్టం చేశారు. క్రిప్టోకరెన్సీ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా విడిగా విచారిస్తుందని చెప్పారు. కాగా రాజ్‌కుంద్రాకు గతంలో ఈ కేసుకు సంబంధించి ఈడీ సమన్లు జారీచేయడంతో ఇటీవల ఆయన దర్యాప్తు సంస్థ ఎదుట హాజరైన విషయం తెలిసిందే.

ఈ స్కామ్‌కు సూత్రధారిగా భావిస్తున్న అమిత్‌ భరద్వాజ్‌తో కుంద్రాకు సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బిట్‌కాయిన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ పేరిట అమిత్‌ భరద్వాజ్‌ 8 వేల మందిని సుమారు రూ. 2 వేల కోట్లకు మోసం చేశాడన్న అభియోగాలు ఉన్నాయి. ఈ ఏప్రిల్‌ నెలలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అమిత్‌ భరద్వాజ్‌, అతని సోదరుడు వివేక్‌లను పుణె పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరోవైపు బిట్‌కాయిన్‌ స్కామ్‌పై రాజ్‌కుంద్రా భార్య శిల్పాశెట్టి, హైప్రొఫైల్‌ సెలబ్రిటీలు సన్నీ లియోన్‌, ప్రాచీ దేశాయ్‌, ఆరతి ఛబ్రియా, సోనాల్‌ చౌహాన్‌, కరిష్మా తన్నా, జరీన్‌ ఖాన్‌,నేహా ధూపియా, హ్యూమా ఖురేషీ, నర్గీస్‌ ఫక్రీ తదితరులను కూడా ఈడీ ప్రశ్నించవచ్చని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు