నో కండోమ్‌ యాడ్స్‌: ప్రభుత్వ కీలక ఆదేశాలు

12 Dec, 2017 11:51 IST|Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: కండోమ్‌ ప్రకటనలపై కేంద్రం ప్రభుత‍్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ముఖ‍్యంగా చిన్నపిల్లలను  ఈ ప్రభావం నుంచి రక్షించేలా సోమవారం కొన్ని ఆంక్షలు విధించింది.  చిన్న పిల్లలపై ప్రభావం చూపే ఆ యాడ్స్‌ను ఉదయం పూట ప్రసారం చేయరాదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది.  అంతేకాదు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు  తప్పవని కూడా హెచ్చరించింది. కండోమ్‌ యాడ్స్‌పై  ప్రకటనలు, వాటి ప్రసార సమయాలపై  ఇటీవల ఇండియన్‌ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కి) మంత్రిత్వ శాఖకు అందించిన  సూచనల మేరకు ఈ దేశాలు జారీ అయ్యాయి.
 
కండోమ్ వాణిజ్య ప్రకటనలను ఉదయం వేళ ప్రసారం చేయరాదు అని కేంద్ర ప్రభుత్వం  దేశంలోని అన్ని టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇవి అసభ్యకరమైన, అనారోగ్య పద్ధతులు సృష్టించగలవంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకు  ప్రసారం చేయడానికి వీల్లేదని సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వశాఖ  ఆదేశించింది. 
 
దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు ఉన్నా.. కొన్ని ఛానళ్లు కండోమ్ యాడ్స్ ప్రసారం చేస్తున్నాయని ఇటీవల విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఈ యాడ్స్‌ను ప్రసారం చేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది.   ఒకవేళ ఆదేశాలను ఉల్లంఘిస్తే, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌​ రూల్స్, 1994  ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. 

కాగా గత సెప్టెంబరులో సన్నీ లియోన్ నటించిన ఒక కండోమ్ ప్రకటన సూరత్‌లో నిరసన సెగలు రాజేసింది.  గుజరాత్‌ నగరం  అంతటా దర్శనమిచ్చిన ఈ హోర్డింగ్స్‌ పై సిటీకి చెందిన హిందూ యువ వాహిని నిరసనకు దిగింది.

మరిన్ని వార్తలు