విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త!

19 Jun, 2017 15:41 IST|Sakshi
విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త!
న్యూఢిల్లీ : విదేశాలకు వెళ్లే భారతీయులకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ శుభవార్తను అందించింది. వచ్చే నెల నుంచి విదేశాలకు వెళ్లే భారతీయులు డిపార్చర్ కార్డులు నింపాల్సినవసరం లేదని పేర్కొంది. అయితే ఇది కేవలం విమానాల్లో వెళ్లే వారికి మాత్రమేనని తెలిపింది. ఒకవేళ రైలు, నౌకల్లో విదేశాలకు వెళ్లే వారు, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద ఎంబార్కేషన్ కార్డును నింపాల్సి ఉంటుందని చెప్పింది. 2017 జూలై 1 నుంచి అన్ని అంతర్జాతీయ విమానశ్రయాల్లో భారతీయులు డిపార్చర్ కార్డులను నింపే ప్రక్రియను రద్దు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ఆర్డర్ జారీచేసింది. ఈ నిర్ణయంతో భారతీయులు ఎలాంటి అవాంతరాలు లేకుండా విదేశాలకు ప్రయాణించవచ్చని పేర్కొంది.  
 
ఇప్పటివరకు ఎవరైతే విదేశాలకు వెళ్తున్నారో వారు కచ్చితంగా తమ పేరును, జన్మించిన తేదీని, పాస్ పోర్ట్ నెంబర్, భారత్ లోని చిరునామా, విమాన నెంబర్, బోర్డింగ్ తేదీని డిపార్చర్ కార్డులో నింపాల్సి ఉంటుంది.  ఇతర సంబంధిత ప్రాంతాల్లో కూడా ఇదే సమాచారం అందుబాటులో ఉంటుందని, ఈ మేరకు డిపార్చర్ కార్డు అవసరం ఉండదని హోం మంత్రిత్వ శాఖ తన ఆర్డర్ లో తెలిపింది. ఈ నిర్ణయంతో ప్యాసెంజర్ నింపుతున్న ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన వివరాల ప్రక్రియ సమయాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు సాయార్థం అధికారులు ఈ మేరకు నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు తెలిసింది. గతేడాది కూడా విదేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులు డ్యూటియబుల్ గూడ్స్ ను తీసుకురాకపోతే డిక్లరేషన్ కార్డును నింపాల్సినవసరం లేదని కస్టమ్స్ డిపార్ట్ మెంట్ ఓ ఆర్డర్ జారీచేసింది. 
మరిన్ని వార్తలు