హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్ ఎస్టేట్ పోర్టల్ నోబ్రోకర్.కామ్ హైదరాబాద్లో అడుగుపెట్టింది. కస్టమర్ నుంచి కస్టమర్కు సేవలందిస్తున్న ఈ కంపెనీ ఇప్పటికే అయిదు నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అద్దె, కొనుగోలు, విక్రయానికి ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్ను ఈ పోర్టల్లో నమోదు చేయవచ్చు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఎటువంటి బ్రోకరేజ్ వసూలు చేయబోమని కంపెనీ ఫౌండర్, సీబీవో సౌరభ్ గర్గ్ తెలిపారు. ఫౌండర్, సీటీవో అఖిల్ గుప్తాతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఒక్క భాగ్యనగరిలో బ్రోకరేజ్ వ్యాపారం ఏటా రూ.4,100 కోట్లుంది. ఈ నగరంలో నోబ్రోకర్.కామ్లో 15,000పైచిలుకు లిస్టింగ్స్ జరిగాయి. 33,000లకుపైగా కస్టమర్లు సేవలను వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా సంస్థకు 65 లక్షల వినియోగదార్లున్నారు. 5 లక్షల లావాదేవీలు పూర్తి అయ్యాయి’ అని వివరించారు.