సత్యం రాజు కుటుంబీకులను ట్రేడింగ్‌కు అనుమతించొద్దు

12 Sep, 2015 00:05 IST|Sakshi
సత్యం రాజు కుటుంబీకులను ట్రేడింగ్‌కు అనుమతించొద్దు

స్టాక్ బ్రోకర్లకు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ సూచన
న్యూఢిల్లీ:
సత్యం కంప్యూటర్స్ స్కామ్‌లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానాలు విధించిన దరిమిలా స్టాక్ ఎక్స్చేంజీలు తదుపరి చర్య లు మొదలుపెట్టాయి. స్కామ్ లో నిందితులైన సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజుతో పాటు ఆయన సంబంధీకులు, సంస్థలు స్టాక్‌మార్కెట్ లావాదేవీల్లో ఏడేళ్ల పాటు పాల్గొనకుండా చూడాలని ట్రేడింగ్ సభ్యులకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సూచించాయి.

నిషేధం ఎదుర్కొంటున్న వారిలో రామలింగ రాజు తల్లి బి. అప్పలనరసమ్మ, ఆయన ఇద్దరు కుమారులు తేజ రాజు .. రామ రాజు, సోదరుడు సూర్యనారాయణ రాజు, ఝాన్సీ రాణి (సూర్యనారాయణ రాజు భార్య), చింతలపాటి శ్రీనివాస రాజు (అప్పట్లో సత్యం డెరైకర్)తో పాటు చింతలపాటి హోల్డింగ్స్, ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్ హోల్డింగ్స్ సంస్థలు ఉన్నాయి. అక్రమంగా ఆర్జించిన రూ. 1,800 కోట్లు కట్టాలంటూ రామలింగ రాజు సంబంధీకులు, సంస్థలను సెబీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు 2009 జనవరి 7 నుంచి వడ్డీ కింద మరో రూ. 1,500 కోట్లు కూడా వీరు కట్టాల్సి ఉంటుంది.  సత్యం ఖాతాల్లో కుంభకోణం జరిగిందంటూ 2009లో రామలింగరాజు స్వయంగా వెల్లడించడంతో స్కామ్ వెలుగులోకి రావడం, ఆయన జైలుకెళ్లడం, కంపెనీని టెక్ మహీంద్రా టేకోవర్ చేయడం తదితర పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే.

మరిన్ని వార్తలు