సిమ్లా టూ చండీగఢ్‌.. జస్ట్‌ 20 నిమిషాలే!

4 Jun, 2018 12:49 IST|Sakshi

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌ టూరిస్ట్‌ రిసార్ట్‌ నుంచి చండీగఢ్‌కు అరగంటలో వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇక నుంచి అది కూడా సాధ్యమవుతుంది. సిమ్లా నుంచి చండీఘడ్‌కు కేవలం 20 నిమిషాల్లో చేరుకునే హెలీ-ట్యాక్సీ సర్వీసును సోమవారం ప్రారంభించారు. హెలికాప్టర్‌ సర్వీసు ఆపరేటర్‌ పవన్‌ హ్యాన్స్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వీసులను లాంచ్‌ చేసింది. రోడ్డు మార్గం ద్వారా నాలుగు గంటల ప్రయాణ సమయాన్ని ఈ సర్వీసులు 20 నిమిషాలకే కుదించనున్నాయి. 19 ప్రయాణికులను ఈ హెలీ-ట్యాక్సీలో ప్రయాణించవచ్చు. కనీస ఛార్జ్‌ ఒక్కో వ్యక్తికి 2,999 రూపాయలు. వారానికి రెండు సార్లు అంటే సోమవారం, శుక్రవారం ఈ హెలీ-ట్యాక్సీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 

సిమ్లా ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 8 గంటలకు టేకాఫ్‌ అయ్యే ఈ హెలికాప్టర్‌, చండీగఢ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8.20 కల్లా ల్యాండ్‌ అవుతుంది. అనంతరం చండీగఢ్‌ నుంచి ఉదయం 9 గంటలకు టేకాఫ్‌ అయి, సిమ్లాకు ఉదయం 9.20 కి చేరుకుంటుందని పవన్‌ హ్యాన్స్‌ అధికారులు చెప్పారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన బట్టి ఈ సర్వీసులను మరింత పెంచుతామని తెలిపారు. సిమ్లా నుంచి తొలి సర్వీసును హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ థాకూర్‌ ప్రారంభించారు. రాష్ట్రంలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ సర్వీసులు ఎంతో ఉపయోగపడనున్నాయన్నారు. చండీగఢ్‌ నుంచి మనాలీ మధ్యలో కూడా ఈ హెలీ-ట్యాక్సీ సర్వీసులను లాంచ్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు