అక్షయ తృతియ: ఒక్క రూపాయికే బంగారం!

27 Apr, 2017 18:32 IST|Sakshi
అక్షయ తృతియ: ఒక్క రూపాయికే బంగారం!
న్యూఢిల్లీ : నోట్ల రద్దు తర్వాత అలీబాబాకు చెందిన పేటీఎం ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ఇప్పటికే అన్ని రకాల డిజిటల్ సర్వీసులు అందిస్తున్న పేటీఎం మరో కొత్తరకం సర్వీసులతో మన ముందుకు వచ్చింది.  ఇంకా ఒక్క రోజుల్లో అక్షయ తృతీయ కావడంతో, ఎంఎంటీసీ-పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎం 'డిజిటల్ గోల్డ్' ను లాంచ్ చేసింది. దీంతో ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారానే బంగారం కొనడం, అమ్మడం వంటి సేవలను కస్టమర్లకు అందించనుంది. ఈ సేవల్లో భాగంగా అతి తక్కువ ధర ఒక్క రూపాయికే బంగారం కొనుగోలుచేసుకోవచ్చని పేటీఎం పేర్కొంది. తమ పేటీఎం మొబైల్ వాలెట్స్ ను వాడుకుంటూనే వినియోగదారులు 24 క్యారెట్ల 999.9 స్వచ్ఛత బంగారాన్ని ఆన్ లైన్ లో కొనుకోవచ్చిన ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ చెప్పింది. 
 
ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎంఎంటీసీ-పీఏఎంపీలోనూ సెక్యుర్ గా గోల్డ్ ను ఐదేళ్ల పాటు స్టోర్ చేసుకోవచ్చని పేర్కొంది. నాణేల రూపంలోనూ కస్టమర్ల అభ్యర్థన మేరకు ఇళ్ల వద్దకు గోల్డ్ ను డెలివరీ చేస్తామని పేర్కొంది. ఎంఎంటీసీ-పీఏఎంపీకి తిరిగి ఆన్ లైన్ లోనూ ఈ గోల్డ్ ను అమ్ముకోవచ్చట. బంగారానికి భారతీయుల పెట్టుబడుల సాధనంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని, బంగారంలో డిజిటల్ గా పెట్టుబడులు పెట్టడానికి తాము సులభతరంగా సేవలందిస్తామని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. మార్కెట్ ఆధారిత ధరలతోనే ఇంటర్నేషనల్ క్వాలిటీ బంగారాన్ని అమ్మడానికి, కొనడానికి కస్టమర్లకు అవకాశముంటుందన్నారు. ఒక్క రూపాయికి కూడా బంగారం కొనుక్కునే అవకాశం వినియోగదారులకు కల్పిస్తామని విజయ్ శేఖర్ చెప్పారు. 20వేల వరకు బంగారం కొనుగోళ్లకు ఎలాంటి కేవైసీ వివరాలను అందించాల్సినవసరం ఉండదు. 
 
మరిన్ని వార్తలు