ఇంటర్‌బ్యాంక్ ఏటీఎం ఫీజు తగ్గింపు

9 May, 2015 02:26 IST|Sakshi
ఇంటర్‌బ్యాంక్ ఏటీఎం ఫీజు తగ్గింపు

ముంబై: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తమ ఇంటర్‌బ్యాంక్ ఏటీఎం నెట్‌వర్క్ లావాదేవీల చార్జీలను 10 శాతం మేర (5 పైసలు) తగ్గిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. లావాదేవీల పరిమాణం పెరగటం, నెట్‌వర్క్ పనితీరు మరింత మెరుగవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ప్రమోట్ చేసిన ఈ సంస్థ... దాదాపు 400 బ్యాంకులకు చెందిన 1.92 లక్షల ఏటీఎంలకు కేంద్రీయ పేమెంట్ గేట్‌వేగా ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రతి లావాదేవీకి 50 పైసలు వసూలు చేస్తోంది.

దీన్ని 45 పైసలకు తగ్గించటమే కాక... లావాదేవీలు పెరగటానికి మరింత తగ్గింపు చేపడతామని కూడా సంస్థ సీఈఓ ఎ.పి.హోతా చెప్పారు. కొత్త ఛార్జీలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఖాతా ఉన్న బ్యాంకు కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగించే వారి నుంచి లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తుండటంపై వివాదం రేగటంతో ఆర్‌బీఐ జోక్యం చేసుకుని తాజా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇతర ఏటీఎంలలో 5 లావాదేవీల వరకు ఉచితం. అంతకు మించితే ఛార్జీలు వసూలు చేస్తారు.

మరిన్ని వార్తలు