ఐదేళ్లలో లక్ష కోట్లకు ఈటీఎఫ్ ఆస్తులు

27 Oct, 2015 01:45 IST|Sakshi
ఐదేళ్లలో లక్ష కోట్లకు ఈటీఎఫ్ ఆస్తులు

ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ
ముంబై: దేశంలో ఈక్విటీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ (ఈటీఎఫ్) ఫండ్స్ వేగంగా విస్తరిస్తున్నాయని, త్వరలోనే వీటి ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అధిగమిస్తుందని  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎఎస్‌ఈ) అంచనా వేస్తోంది.  గత 12 ఏళ్లలో ఈటీఎఫ్ ఆస్తుల విలువ 12 రెట్లు పెరిగాయని, వచ్చే ఐదేళ్లలో ఈటీఎఫ్‌లు నిర్వహిస్తున్న ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ అన్నారు. సోమవారం ముంబైలో జరిగిన ‘ఈటీఎఫ్ కాన్ఫరెన్స్ 2015’ సదస్సులో ఆమె మాట్లాడుతూ ఈక్విటీ ఈటీఎఫ్‌ల్లో 97 శాతం ఆస్తులను ఎన్‌ఎస్‌ఈ నిర్వహిస్తోందన్నారు.

ప్రస్తుతం ఈక్విటీ ఈటీఎఫ్ ఆస్తుల నిర్వహణ విలువ రూ. 10,000 కోట్ల లోపునకే పరిమితమయ్యింది. ఈటీఎఫ్‌లకు డిమాండ్ పెరగనుండటంతో రానున్న కాలంలో కమోడిటీ విభాగంలో కూడా ఈటీఎఫ్‌లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈమధ్యనే గవర్నమెంట్ సెక్యూరిటీస్, గిల్ట్ విభాగాల్లో ఈటీఎఫ్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సెబీ చీఫ్ యు.కె. సిన్హా మాట్లాడుతూ ఈటీఎఫ్‌ల్లో మరింత పారదర్శకత తీసుకురానున్నట్లు తెలిపారు. పెట్టుబడి సాధనాల్లో ఈటీఎఫ్‌లు అతి ముఖ్యమైనవని, కానీ కొత్త పథకాలను సృష్టించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. బయట దేశాలవలే రిస్క్‌తో కూడుకున్న పథకాలు ప్రవేశపెట్టడానికి దూరంగా ఉండాలన్నారు.

మరిన్ని వార్తలు