ఎన్‌ఎస్‌ఈ కొత్త చీఫ్‌ విక్రమ్‌ లిమాయే!

4 Feb, 2017 00:49 IST|Sakshi
ఎన్‌ఎస్‌ఈ కొత్త చీఫ్‌ విక్రమ్‌ లిమాయే!

త్వరలో అధికారికంగా వెల్లడి
న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) కొత్త సీఈఓ, ఎండీగా విక్రమ్‌ లిమాయే ఎంపికయ్యారని సమాచారం. రెండు నెలల క్రితం అనూహ్యంగా ఎన్‌ఎస్‌ఈ సీఈఓ పదవి నుంచి వైదొలగిన చిత్ర రామకృష్ణన్‌ స్థానంలో ఐడీఎఫ్‌సీ చీఫ్‌గా పనిచేస్తున్న విక్రమ్‌ లిమాయే పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. లిమాయే ఎంపికను అశోక్‌ చావ్లా అధ్యక్షతన గల ఎన్‌ఎస్‌ఈ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించిందని, త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఎంపికకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ అమోదం పొందాల్సి ఉంటుంది. బీసీసీఐ(బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) నిర్వహణకు సుప్రీమ్‌ కోర్టు ఇటీవల నియమించిన నలుగురు సభ్యుల కమిటీలో విక్రమ్‌ లిమాయే కూడా ఒకరు. రూ.10 వేల కోట్ల ఐపీఓకు ఎన్‌ఎస్‌ఈ సన్నద్ధమవుతున్న సందర్భంలో ఆయన ఎంపిక జరగడం విశేషం.

ప్రస్తుతం ఐడీఎఫ్‌సీ ఎండీ, సీఈఓగా పనిచేస్తున్న విక్రమ్‌  లిమాయే వాణిజ్య శాస్త్రవేత్త. పెన్సిల్వేనియా యూనివర్సి టీలో వార్టన్‌  బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ(ఫైనాన్స్‌ అండ్‌ మల్టీనేషనల్‌ మేనేజ్‌మెంట్‌) పట్టా పొందారు. 1987లో అర్థర్‌ అండెర్సన్‌ సంస్థలో తన కెరీర్‌ ప్రారంభించారు. ఎర్నస్ట్‌ అండ్‌ యంగ్, సిటీ బ్యాంక్‌ తదితర సంస్థల్లో కూడా పనిచేశారు. క్రెడిట్‌ సూసీ సంస్థ కోసం వాల్‌స్ట్రీట్‌లో ఎనిమిదేళ్లు పనిచేశారు. 2004లో ముంబైకి తిరిగి వచ్చారు. మౌలిక, ఆర్థిక, మార్కెట్, వాణిజ్యం తదితర అంశాలకు సంబంధించిన ప్రభుత్వ, పారిశ్రామిక సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ కమిటీలకు ఆయన తన సేవలందించారు.

మరిన్ని వార్తలు