తనఖా షేర్ల బదిలీ ఆపండి

4 Dec, 2019 02:09 IST|Sakshi

కార్వీ కేసులో శాట్‌ను ఆశ్రయించిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు...

సెక్యూరిటీల బదలాయింపుపై శాట్‌ మధ్యంతర ఉత్తర్వులు

నేడు వెలువడనున్న తుది ఆదేశాలు

న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కార్వీకి రుణాలిచ్చిన బ్యాంకులకు ఊరటనిస్తూ సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ శాట్‌ ఆదేశాలిచి్చంది. నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ (ఎస్‌ఎస్‌డీఎల్‌).. మరిన్ని షేర్లను కార్వీ క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించకుండా స్టే విధిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది ఉత్తర్వులు బుధవారం (నేడు) మధ్యాహా్ననికి ఇవ్వనుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌డీఎల్‌ ఇప్పటికే చాలామటుకు షేర్లను క్లయింట్లకు బదిలీ చేయగా.. మరికొందరు ఇన్వెస్టర్లకు సెక్యూరిటీల బదలాయింపు ఇంకా జరగాల్సి ఉంది. అయితే, తనఖా పెట్టిన షేర్లకు ప్రతిగా కారీ్వకి రుణాలిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్, బజాజ్‌ ఫైనాన్స్‌ మొదలైన సంస్థలు ఈ విషయంలో సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ శాట్‌ను ఆశ్రయించాయి. దీనిపైనే శాట్‌ తాజా ఆదేశాలిచి్చంది.  

రుణాలపై ప్రభావం చూపుతుంది..
రుణాల కోసం తనఖా ఉంచిన షేర్లను ఇలా ఏకపక్షంగా బదలాయించేస్తే.. ఇలాంటి రుణాల మంజూరుపై తీవ్ర ప్రభావం పడుతుందని బ్యాంకులు తమ వాదన వినిపించాయి. ఆయా షేర్లను క్లయింట్లు విక్రయించేసిన పక్షంలో మళ్లీ వెనక్కి రప్పించడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో క్లయింట్లకు బదిలీ చేసిన షేర్లను వెనక్కి తీసుకుని, ఎస్క్రో అకౌంట్లో ఉంచాలని కోరాయి. నియంత్రణ సంస్థలు, నియంత్రిత సంస్థలు చేసే ’తప్పులకు’ తమను బాధ్యులను చేయడం సరికాదని బ్యాంకులు పేర్కొన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ. 470 కోట్ల విలువైన షేర్లకు ప్రతిగా రూ. 300 కోట్ల రుణమిచి్చంది. మిగతా వాటికన్నా ముందుగా శాట్‌ను ఆశ్రయించిన బజాజ్‌ ఫైనాన్స్‌ .. సుమారు రూ. 345 కోట్ల రుణమిచ్చింది. మరోవైపు, బ్యాంకులు బాధ్యతారహితంగా బ్రోకరేజీలకు రుణాలిస్తున్నాయంటూ ఎన్‌ఎస్‌డీఎల్‌ తరఫు న్యాయవాది ఆరోపించారు. సెబీ ఆదేశాల మేరకే క్లయింట్ల ఖాతాల్లోకి ఎన్‌ఎస్‌డీఎల్‌ షేర్లను బదిలీ చేసిందని స్పష్టం చేశారు.

సుమారు 95,000 మంది క్లయింట్లకు చెందిన రూ. 2,300 కోట్లకు పైగా విలువ చేసే షేర్లను బజాజ్‌ ఫైనాన్స్‌ తదితర సంస్థల్లో తనఖా పెట్టి కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ దాదాపు రూ. 600 కోట్ల దాకా రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీపై సెబీ ఆంక్షలు విధించగా, స్టాక్‌ ఎక్సే్చంజీలు ఆ సంస్థ ట్రేడింగ్‌ లైసెన్సును రద్దు చేశాయి. ఈ క్రమంలో.. కార్వీ తనఖా పెట్టిన షేర్లను ఆయా క్లయింట్ల ఖాతాల్లోకి బదిలీ చేయాలన్న సెబీ ఆదేశాలను నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డీఎల్‌) ప్రస్తుతం అమలు చేస్తోంది. ఇప్పటికే 83,000 మంది ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి షేర్ల బదిలీ పూర్తయ్యింది. చెల్లింపుల సమస్య కారణంగా మిగతా ఖాతాల్లోకి బదలాయింపు జరగాల్సి ఉంది.

మరిన్ని వార్తలు