'మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం: వన్‌ప్లస్‌

3 Jul, 2020 12:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ పెరగడంతో చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా విధానానికి తాము కట్టుబడి ఉన్నామని శుక్రవారం ప్రకటించింది. మేక్‌ ఇన్‌ ఇండియా వ్యూహంలో సమగ్ర, దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నామని వన్‌ప్లస్‌ టాప్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే భారతదేశంలో టీవీల తయారీని కంపెనీ  ప్రారంభించామన్నారు.  అలాగే ఈ వారంలో తొలి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్‌ను భారత్, యూరప్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.

2014లో ప్రవేశించినప్పటి నుండి భారతదేశం వన్‌ప్లస్‌కు కీలకమైన మార్కెట్‌గా కొనసాగుతోందనీ,  'మేక్ ఇన్ ఇండియా' చొరవకు అనుగుణంగా  ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి  చాలా కష్టపడ్డామని వన్‌ప్లస్‌ ఇండియా వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ నవ్నిత్ నక్రా చెప్పారు. దేశంలో వన్‌ప్లస్ టీవీల తయారీని మొదలు పెట్టామని, గత సంవత్సరం హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ప్రారంభించామని వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడికి కట్టుబడి ఉన్నామని నక్రా చెప్పారు. ఈ కేంద్రంలోని  కెమెరా ల్యాబ్, కమ్యూనికేషన్స్, నెట్‌వర్కింగ్ ల్యాబ్‌లు ఆటోమేషన్ ల్యాబ్‌ల కనుగుణంగా కెమెరా, ఆటోమేషన్, నెట్‌వర్కింగ్, కనెక్టివిటీ  ఫ్యూచర్‌ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు. ప్రధానంగా 5 జీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. దేశంలో 5 వేలకు పైగా ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ఉండగా, త్వరలోనే ఈ సంఖ్యను 8000 దాటాలనే ప్రణాళికలో ఉన్నామని వివరించారు.  (నిషేధంపై టిక్‌టాక్ స్పందన)

వన్‌ప్లస్ 2018 ఫిబ్రవరి నుండి భారతదేశంలో తన ఉత‍్పత్తులను తయారు చేస్తోంది. ప్రీమియం హ్యాండ్‌సెట్ తయారీదారు గురువారం  అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ టీవీ యు, వై సిరీస్‌ను కంపెనీ గురువారం విడుదల చేసింది. కాగా  మేక్ ఇన్ ఇండియాలో  భాగంగా చైనాకు చెందిన అనేక కంపెనీలు భారీ  పెట్టుబడులు పెట్టాయి. అయితే లద్దాఖ్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సమస్యల రీత్యా, టిక్‌టాక్, వీచాట్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు