మరో 3 చమురు, గ్యాస్ నిక్షేపాలు: ఓఎన్‌జీసీ

14 Dec, 2014 01:08 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్తగా మూడు చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్రకటించింది. ఇవి కృష్ణా-గోదావరి బేసిన్, ముంబై సముద్ర క్షేత్రంలోనూ, కావేరీ బేసిన్‌లోను ఉన్నట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓడలరేవు పట్టణానికి దాదాపు 43 కిలోమీటర్ల దూరంలో ఓఎన్‌జీసీకి చెందిన కేజీ బేసిన్ బ్లాకు ఉంది. ఇందులో జీడీ-11-1 బావిని దాదాపు 2,810 మీటర్ల లోతున తవ్వగా.. గ్యాస్ నిక్షేపాల ఆధారాలు లభ్యమైనట్లు ఓఎన్‌జీసీ తెలిపింది.

సుమారు 36 మీటర్ల మేర గ్యాస్ ఉండొచ్చని అంచనాలు వేస్తున్నట్లు వివరించింది. మరోవైపు, 100 శాతం మేర మధ్యంతర డివిడెండ్ ప్రకటించనున్నట్లు తెలిపింది. దీని ప్రకారం రూ. 5 ముఖ విలువ గల షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్ ఇచ్చే ప్రతిపాదనకు సంస్థ బోర్డు ఆమోదముద్ర వేసింది. డివిడెండ్ రూపంలో మొత్తం రూ. 4,278 కోట్లు చెల్లించనుండగా, ఇందులో ప్రభుత్వ వాటా కింద రూ. 2,948 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ. 856 కోట్ల మేర డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా కట్టనున్నట్లు సంస్థ తెలిపింది.

>
మరిన్ని వార్తలు