మొజాంబిక్‌లో మూడు భారత కంపెనీల పెట్టుబడి

14 Apr, 2015 01:49 IST|Sakshi

600 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్న ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్
న్యూఢిల్లీ: మొజాంబిక్ తీరంలోని రొవుమ ఏరియా-1 సహజవాయువు క్షేత్రంలో మూడు భారత ప్రభుత్వ సంస్థలు నాలుగేళ్లలో 600 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఓఎన్‌జీసీకి చెందిన ఓఎన్‌జీసీ విదేశ్, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్ కంపెనీలు ఈ స్థాయి భారీ పెట్టుబడులు పెట్టనున్నాయని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం చెప్పారు. ఈ క్షేత్రం నుంచి సహజవాయువును ద్రవీకృత సహజవాయువు(ఎల్‌ఎన్‌జీ-లిక్విఫైడ్ నేచురుల్ గ్యాస్)గా మార్చి భారత్ వంటి దేశాలకు ఎగుమతులు చేస్తాయని పేర్కొన్నారు.

ఈ సహజవాయువు క్షేత్రంలో ఈ మూడు కంపెనీలకు 30 శాతం వాటా ఉంది. ఈ క్షేత్రంలో 75 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిక్షేపాలున్నట్లు అంచనా. ఇప్పటికే ఈ క్షేత్రంలో 600 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టామని ప్రధాన్ వివరించారు. ఈ బ్లాక్ నుంచి తొలి ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి 2019 మొదట్లో జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల మొజాంబిక్ పర్యటన అనంతరం భారత్ వచ్చిన ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు