కేజీ బేసిన్‌లో 45 బావుల తవ్వకానికి ఓఎన్‌జీసీ రెడీ!

8 Dec, 2014 01:04 IST|Sakshi
కేజీ బేసిన్‌లో 45 బావుల తవ్వకానికి ఓఎన్‌జీసీ రెడీ!

హైదరాబాద్: ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ... ఆంధ్ర ప్రదేశ్‌లోని కేజీ బేసిన్‌లో 45 చమురు-గ్యాస్ బావుల తవ్వకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.16,200 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అంచనా. కంపెనీకి ఇక్కడున్న కేజీ-డీ5 బ్లాక్‌లోని ఉత్తర అన్వేషణ ప్రాంతం(ఎన్‌డీఏ)లో ఈ డెవలప్‌మెంట్ డ్రిల్లిం గ్‌ను చేపట్టడం కోసం అనుమతులివ్వాల్సిందిగా.. పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖను కూడా ఇప్పటికే కోరింది. ఇటీవల జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో ఈ ప్రణాళికలపై దృష్టి సారించినట్లు సమాచారం. కాగా, 2019కల్లా ఇక్కడ చమురు-గ్యాస్ ఉత్పత్తిని మొదలుపెట్టాలని ఓఎన్‌జీసీ భావిస్తోంది.

ఏడాదికి గరిష్టంగా 4.5 మిలియన్ టన్నుల క్రూడ్(ముడి చమురు) ఉత్పత్తిని అంచనా వేస్తోంది. తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదిత డ్రిల్లింగ్ ప్రాంతాలు ఉన్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ బ్లాక్‌లో మొత్తం 10 గ్యాస్ నిక్షేపాలను కూడా ఓఎన్‌జీసీ కనుగొంది. కాగా కేజీ-డీ5ను కంపెనీ ఉత్తర, దక్షిణ అన్వేషణ ప్రాంతాలు(ఎన్‌డీఏ, ఎస్‌డీఏ)గా విభజించింది. ఎన్‌డీఏలో కనీసం 9 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.55,800 కోట్లు) పెట్టుబడికి ఆస్కారం ఉందని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక్కడి 7 క్షేత్రాల్లో 92.3 మిలియన్ టన్నుల చమురు, 97.5 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ నిల్వలున్నాయనేది కంపెనీ అంచనా వేసినట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు