ఈ-ఫైలింగ్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్

14 Jul, 2015 01:43 IST|Sakshi
ఈ-ఫైలింగ్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల ఈ-ఫైలింగ్ వెరిఫికేషన్ కోసం ఆదాయ పన్ను శాఖ సోమవారం వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత వ్యవస్థను ప్రారంభించింది. తద్వారా నిర్దిష్ట పరిమితికి లోబడిన ఫైలింగ్స్‌కి సంబంధించి బెంగళూరులోని తమ కార్యాలయానికి పేపర్ అక్నాలెడ్జ్‌మెంట్‌ను పంపే విధానానికి స్వస్తి పలకనుంది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆధార్ నంబర్, ఏటీఎం, ఈమెయిల్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.  రూ. 5 లక్షలు అంతకన్నా తక్కువ వార్షికాదాయం కలిగిన వారు, రీఫండ్ క్లెయిములేమీ లేని వారు.. ఈ-ఫైలింగ్‌కి, తమ ఆదాయ పన్ను రిటర్నును రూఢిపర్చుకోవడానికి ఆదాయ శాఖ దగ్గర నమోదు చేసుకున్న మొబైల్ నంబరు లేదా ఈ-మెయిల్ ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) జనరేట్ చేసుకోవచ్చు.

అయితే, ఆయా పన్ను చెల్లింపుదారులను బట్టి ఆదాయ పన్ను శాఖ ఈ సదుపాయాన్ని అందిస్తుంది. ఉదాహరణకు, వార్షికాదాయం రూ. 5 లక్షల కన్నా తక్కువ ఉన్నప్పటికీ, సదరు చెల్లింపుదారుపై ఆదాయ పన్ను శాఖ వద్ద ప్రతికూల సమాచారం ఉన్న పక్షంలో అటువంటి వారికి ఓటీపీ సదుపాయం వర్తించదు. ఆధార్ డేటాబేస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం తదితర సాధనాలను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది.
 
ఒక్కో పర్మనెంట్ అకౌంటు నంబరుకు (పాన్) ప్రత్యేకమైన పది అంకెల అల్ఫాన్యూమరిక్ (అక్షరాలు, అంకెలు కలగలిసిన) పాస్‌వర్డ్ రూపంలో ఈవీసీ ఉంటుంది. ఇది మరే ఇతర పాన్ నంబరుకూ పనిచేయదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగిస్తున్న వారు తమ బ్యాంకు పోర్టల్‌లోకి లాగిన్ అయితే వారి మొబైల్ నంబరుకు ఈవీసీ వస్తుంది. ఆధార్ అవసరం లేని వారి విషయంలో ఈ ఓటీపీకి 72 గంటలపాటు  వేలిడిటీ ఉంటుంది. దీన్ని తుది ఐటీఆర్‌ను సమర్పించేందుకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ఆధార్ ఆధారిత విధానంలో .. మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీ వేలిడిటీ 10 నిమిషాల పాటు ఉంటుంది. ఇవే కాకుండా ఏటీఎం ద్వారా కూడా ఈవీసీని జనరేట్ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు