సుమోటోగా పాన్ జారీ

8 Jul, 2019 13:27 IST|Sakshi

న్యూఢిల్లీ: పాన్, ఆధార్‌ను అనుసంధానించే దిశగా ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేవలం ఆధార్‌తోనే ఐటీ రిటర్నులు దాఖలు చేసే వారికి సుమోటో ప్రాతిపదికన పాన్‌ (పర్మనెంట్‌ అకౌంటు నంబరు) జారీ చేసే యోచన ఉన్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌ ప్రమోద్‌ చంద్ర మోదీ తెలిపారు. పాన్ లేని వారు ఆధార్‌ నంబరుతోనైనా ఐటీ రిటర్నులు దాఖలు చేయొచ్చంటూ బడ్జెట్‌లో ప్రతిపాదన చేసిన నేపథ్యంలో ఇకపై పాన్‌ అవసరం ఉండదా అన్న ప్రశ్నలకు స్పందిస్తూ మోదీ ఈ మేరకు సమాధానమిచ్చారు. ‘ఈ ప్రతిపాదన అర్థం? పాన్ పూర్తిగా నిరుపయోగంగా మారుతుందని కాదు. పాన్‌ లేకుండా.. కేవలం ఆధార్‌ మాత్రమే ఉన్న పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేసేందుకు ఇది అదనపు సదుపాయంగా మాత్రమే భావించాలి‘  అని ఆయన చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో అసెసింగ్‌ అధికారి తనంత తానుగా పాన్‌ నంబరును కేటాయించవచ్చని మోదీ వివరించారు. ప్రస్తుతం దేశీయంగా 120 ఆధార్‌ నంబర్లు, 41 కోట్ల పాన్‌ నంబర్లు జారీ అయ్యాయి. వీటిల్లో 22 కోట్ల పాన్ లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి.  

మరిన్ని వార్తలు