108 ఏళ్ల హోటల్‌..నాలుగేళ్ల తర్వాత..

9 Jul, 2018 18:53 IST|Sakshi
పారిస్‌లోని చారిత్రక లుటెటియా లగ్జరీ హోటల్‌ ముస్తాబు

పారిస్‌ : పారిస్‌లో చరిత్రాత్మక 108 ఏళ్ల పురాతన లగ్జరీ హోటల్‌ లుటెటియా నాలుగేళ్ల పాటు సాగిన మేకోవర్‌ అనంతరం తిరిగి ప్రారంభం కానుంది. 200 మిలియన్ల యూరోల ఖర్చుతో ఈ హోటల్‌ ఆధునిక కస్టమర్లకు ఆతిథ్యమిచ్చేందుకు అత్యాధునిక హంగులతో సిద్ధమైంది. పికాసో, హెన్రీ మాటిస్‌ వంటి సుప్రసిద్ధ ఆర్టిస్టులు సహా ఎందరో దిగ్గజాలు ఈ హోటల్‌లో సేదతీరిన వారే.

నూతన హంగులతో ముందుకొచ్చిన ఈ ఐదు నక్షత్రాల హోటల్‌ ఈనెల 12 నుంచి పునఃప్రారంభమవుతందని హోటల్‌ ప్రతినిధి చెప్పారు. ఈ లగ్జరీ హోటల్‌లో స్పా, ఇండోర్‌ పూల్‌, జాజ్‌ బార్‌ వంటి సౌకర్యాలున్నాయని తెలిపారు.ఈ చారిత్రక హోటల్‌ అత్యాధునిక సౌకర్యాలతో గతంలో మాదిరే కస్టమర్లను ఆకట్టుకుంటుందని లుటెటియా హోటల్‌ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

కాగా 2015 నవంబర్‌లో పారిస్‌ హోటల్‌లో జరిగిన భీకర దాడిలో 130 మంది మృత్యువాత పడినప్పటి నుంచి లగ్జరీ హోటళ్లలో ఆక్యుపెన్సీ రేట్‌ 52 శాతం నుంచి 15 శాతానికి దిగజారింది. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ హోటల్‌ వినియోగదారులను తనదైన రాజసం, చారిత్రక విలువలతో ఆకట్టుకుంటుందని లుటెటియా ప్రతినిధి చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు