జనవరిలో 2,80,125 వాహన అమ్మకాలు
క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2 శాతం తక్కువ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగంలో గడ్డు పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి నెలలోనూ ప్రయాణికుల వాహనాల్లో 2 శాతం క్షీణత నమోదైంది. వరుసగా మూడో నెలలోనూ డిమాండ్ క్షీణించింది. దీంతో మొత్తం 2,80,125 వాహనాలు అమ్ముడయ్యాయని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. పండుగ సీజన్లో అమ్మకాలు ఆశించినంత లేకపోవడంతో నిల్వలను తగ్గించుకోవడంపై తయారీదారులు దృష్టి పెట్టినట్టు పేర్కొంది. క్రితం ఏడాది జనవరిలో అమ్ముడైన వాహనాలు 2,85,467 యూనిట్లుగా ఉన్నాయి.
కార్ల విక్రయాలు వరుసగా మూడో నెలలోనూ తగ్గాయి. క్రితం ఏడాది జనవరితో పోలిస్తే 2.65% తగ్గి 1,79,389 యూనిట్లుగా ఉన్నాయి. మారుతి సుజుకి ప్యాసింజర్ వాహన విక్రయాలు జనవరిలో 0.18 శాతమే పెరిగాయి. 1,39,440 వాహనాలను ఈ సంస్థ విక్రయించింది. ప్యాసింజర్ కార్ల అమ్మకాల వరకే చూస్తే 1,01,865 యూనిట్లుగా ఉన్నాయి.