పతంజలి జీన్స్‌ వచ్చేస్తున్నాయ్‌..

14 Jun, 2018 19:36 IST|Sakshi

న్యూఢిల్లీ : ఎఫ్‌ఎంసీజీ మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపేసిన అనంతరం పతంజలి ఆయుర్వేద్‌ సంస్థ వస్త్ర మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి వరకు ‘పరిధాన్‌’ పేరుతో క్లాతింగ్‌(వస్త్ర) బ్రాండ్‌ను లాంచ్‌ చేయనున్నట్టు పతంజలి ఎండీ, సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ చెప్పారు. వస్త్రాలను ఇన్‌హౌజ్‌లోనే థర్డ్‌ పార్టీ ద్వారా తయారు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కొత్త వ్యాపారాల నిర్వహణ కోసం నోయిడాలో ఓ బృందాన్ని కూడా ఏర్పాటుచేసినట్లు చెప్పారు. వీటి కోసం ఎక్స్‌క్లూజివ్‌గా మెట్రో, నాన్‌-మెట్రో నగరాల్లో 100 స్టోర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.పతంజలి పరిధాన్‌ బ్రాండ్ కింద పిల్లల దుస్తులు, యోగా దుస్తులు, స్పోర్ట్స్‌వేర్‌, టోపీలు, బూట్లు, టవల్స్‌, దుప్పట్లు, యాక్ససరీస్‌ వంటి 3000 రకాల వస్తువులను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అంతకముందే యోగా గురువు బాబా రాందేవ్‌ వెల్లడించారు. వీటిలో ముఖ్యంగా స్వదేశీ జీన్స్‌ ఉండనున్నట్టు, భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా స్వదేశీ జీన్స్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘జీన్స్‌ అనేది వెస్టరన్‌ కాన్సెప్ట్‌. ఈ కాన్సెప్ట్‌తో మనం రెండింటిన్నీ అనుసరించవచ్చు. ఒకటి వారిని బాయ్‌కాట్‌ చేయడం లేదా వాటిని స్వీకరించడం. కానీ దేశీయ సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించలేం ఎందుకంటే జీన్స్‌ చాలా పాపులర్‌ అయ్యాయి. దీంతో వెస్టరన్‌ మాదిరిగా కాకుండా.. పూర్తిగా స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ జీన్స్‌ను తయారుచేస్తున్నాం’  అని బాలకృష్ణ కూడా ఓ సందర్భంలో చెప్పారు. దీంతో ఈ జీన్స్‌ ఎలా ఉండబోతుందోనని వినియోగదారుల్లో ఆసక్తి మొదలైంది. మొత్తానికి ఏడాది చివర్లోనే ఈ జీన్స్‌ మార్కెట్లోకి రానున్నట్లు బాలకృష్ణ తాజాగా వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు