రూ.500 కోట్లు దాటిన ‘పెప్స్‌’ వ్యాపారం

20 Dec, 2019 04:11 IST|Sakshi
14వ వార్షికోత్సవంలో జేఎండీ శంకర్‌రామ్, ఎండీ మాధవన్‌ (ఎడమ నుంచి)

సాక్షి బెంగళూరు: వ్యాపారంలో ఎంతమందికి చేరువయ్యామన్నదే ప్రధానమని పెప్స్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.మాధవన్‌ చెప్పారు. సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... శరీరానికి నిద్ర ప్రధానం కాబట్టి ఎలాంటి పరుపు కొనాలనే దానిపై ప్రస్తుతం ఎందరినో సంప్రదించాల్సి వస్తోందని చెప్పారు. గత 14 ఏళ్లలో దేశ వ్యాప్తంగా లక్షల మంది పెప్స్‌ పరుపులు కొన్నారని తెలియజేశారు. రూ.4 కోట్లతో వ్యాపారం ప్రారంభించగా.. 14 ఏళ్లలో రూ.500 కోట్లకు చేరామని చెప్పారాయన. ‘‘కొత్త పరుపు కొనడంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పరుపు ఎత్తు కీలకం. నేలమట్టం నుంచి 24 అంగుళాల ఎత్తులో ఉండటం శ్రేయస్కరం’’ అని వివరించారు. పరుపులు పాతబడిన వెంటనే మార్చుకోవాలని.. పదేళ్లకు మించి వినియోగించరాదని సూచించారు. భారతదేశంలో కోల్‌కతా, కోయంబత్తూరు, ఢిల్లీ, పుణేలో ఉత్పత్తి కేంద్రాలున్నాయని తెలియజేశారు.  

గ్రామ స్థాయి వరకు చేరవేయడమే లక్ష్యం  
పెప్స్‌ పరుపులను పట్టణాల నుంచి గ్రామ స్థాయి వరకు చేరవేయడమే లక్ష్యమని పెప్స్‌ ఇండస్ట్రీస్‌ జేఎండీ జి.శంకర్‌రామ్‌ చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో పెప్స్‌ శాఖలు ప్రాచుర్యం పొందాయని, ఏపీలో కోస్తా ప్రాంతంలో వ్యాపారం బాగుందని చెప్పారు. రాయలసీమలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం విదేశీ మెటీరియల్‌పై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నా.. పెప్స్‌ పరుపులకు మాత్రం ఆదరణ తగ్గలేదని చెప్పారాయన.
 

మరిన్ని వార్తలు