స్వల్పంగా పెరిగిన పెట్రోల్‌ ధరలు

13 Sep, 2018 08:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా ఇంధన ధరలు మాత్రం అసలు తగ్గడం లేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, దేశీయంగా పన్నుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పెట్రో ధరలు పెరుగుతున్నాయే తప్ప ఏ మాత్రం తగ్గుదల కిందకి దిగిరావడం లేదు. బుధవారంతో పోలిస్తే గురువారం పెట్రో ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా సగటున పెట్రోలు ధర 13 పైసలు, డీజిల్‌ ధర 11 పైసల చొప్పున పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రికార్డు స్థాయిల్లో రూ. 81 మార్కును తాకింది. లీటరు డీజిల్‌ ధర కూడా చారిత్రాత్మక గరిష్టంలో రూ. 73.08గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు ధర 15 పైసలు పెరిగి, రూ. 88.39, డీజిల్‌ ధర రూ. 77.58గా ఉంది.

అయితే అంతకంతకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం సైతం ఒత్తిడులను ఎదుర్కొంటోంది. అటు ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. రూపాయి విలువ తగ్గుతుండటం, పెట్రోల్‌, డీజిల్‌పై కూడా ప్రభావం కనిపిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై, క్షీణిస్తున్న డాలర్‌ మారకంలో రూపాయి విలువపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారంలో సమావేశం నిర్వహించబోతున్నారు. 

హైదరాబాద్‌ : లీటరు పెట్రోలు ధర : రూ 85.88 డీజిల్‌ ధర రూ.79.49

మరిన్ని వార్తలు