పది రోజుల్లో పెట్రోల్‌పై అతిపెద్ద తగ్గింపు

8 Jun, 2018 08:41 IST|Sakshi
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : 16 రోజుల పాటు వరుసగా వినియోగదారులకు వాత పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు... గత 10 రోజుల నుంచి మెల్లమెల్లగా తగ్గింపు బాట పట్టాయి. నేడు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గించాయి. ఈ తగ్గింపు గత 10 రోజుల్లో పెట్రోల్‌ ధరలపై చేపట్టిన తగ్గింపులో అతిపెద్ద తగ్గింపని తెలిసింది. లీటరు పెట్రోల్‌పై 21 పైసలు, లీటరు డీజిల్‌పై 15 పైసలు తగ్గించినట్టు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. దీంతో లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో 21 పైసలు తగ్గి 77.42గా... లీటరు డీజిల్‌  ధర 15 పైసలు తగ్గి 68.58గా నమోదైంది. నేడు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో నమోదైన డేటాలో లీటరు పెట్రోల్‌ ధర ముంబైలో రూ.85.45గా, కోల్‌కతాలో రూ.80.28గా, చెన్నైలో రూ.80.59గా ఉన్నాయి. అదేవిధంగా డీజిల్‌ ధరలు కూడా ముంబైలో రూ.73.17గా, కోల్‌కతాలో రూ.71.28గా, చెన్నైలో రూ.72.56గా ఉన్నాయి. కాగ, గత 10 రోజుల్లో మొత్తం పెట్రోల్‌ ధర రూపాయి మేర తగ్గింది.

భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి ఇదే అతిపెద్ద కోత అని తెలిసింది. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకి తీసుకురావాలని, దీంతో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులను తేలికగా గమనించవచచ్చని కేంద్ర ఆయిల్‌ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ చెప్పిన ఒక్కరోజులోనే, ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌పై భారీగా కోత పెట్టాయి. మరోవైపు అంతర్జాతీయంగా కూడా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతుండటంతో, దేశీయంగానూ ఆ ప్రభావం కనిపిస్తోంది. తొలుత ఒక్క పైసా, ఐదు పైసలు అలా తగ్గించిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇప్పుడు కాస్త పెంచి, రెండకెల్లో ధరలను తగ్గించాయి. కర్ణాటక ఎన్నికల అనంతరం వరుసగా 16 రోజుల పాటు ఎడతెరపి లేకుండా పెరుగుతూనే పోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, గత 10 రోజుల నుంచి మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు