మళ్లీ రూ.80 మార్కు దాటిన పెట్రోల్‌

5 Feb, 2018 12:42 IST|Sakshi
పెట్రోల్‌ బంకులు(ఫైల్‌)

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గరిష్ట స్థాయిల్లో ఈ ధరలు సోమవారం నమోదయ్యాయి. సోమవారం లీటరు పెట్రోల్‌ ధర 15 పైసలు, లీటరు డీజిల్‌ ధర 7 పైసలు పెరిగింది. దీంతో ముంబైలో మరోసారి రూ.80 మార్కును పెట్రోల్‌ ధర అధిగమించి, రూ.81.17గా నమోదవుతోంది. డీజిల్‌ రూ.68.30గా ఉంది. ముంబైలో స్థానిక పన్ను లేదా వ్యాట్‌ రేట్లు అత్యధికంగా ఉండటంతో, అక్కడ ధరలు మోత మోగుతున్నాయి. ఇక ఢిల్లీలో 2014 మార్చి నుంచి అత్యంత గరిష్ట స్థాయిల్లోకి పెట్రోల్‌ ధర ఎగిసింది. లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.73.31గా, డీజిల్‌ ధర రూ.64.14గా రికార్డయ్యాయి.

డిసెంబర్‌ మధ్య నుంచి లీటరు పెట్రోల్‌ ధర కనీసం రూ.4, డీజిల్‌ ధర రూ.5.77 మేర పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతుండటంతో, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో వీటిపై రెండు రూపాయల ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించారు. కానీ స్థానిక పన్నుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో, ధరలు పైకి ఎగుస్తూనే ఉన్నాయి. రెండు రూపాయల మేర ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించిన ప్రభుత్వం, కొత్తగా పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు 8 రూపాయల రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ను విధిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైన అంతర్జాతీయ ఆయిల్‌ ధరలు ప్రస్తుతం తగ్గుతున్నాయి. కానీ దేశీయంగా మాత్రం ఆ ప్రభావం కనుబడుట లేదు. 

మరిన్ని వార్తలు