ఇక పెట్రోనెట్ గ్యాస్ బంకులు

12 Dec, 2016 14:46 IST|Sakshi
ఇక పెట్రోనెట్ గ్యాస్ బంకులు
ఎల్‌ఎన్‌జీ అవుట్‌లెట్‌ల ఏర్పాటుకు ఓఎంసీలతో సంప్రదింపులు
 ఐఓసీ, హెచ్‌పీ, భారత్ పెట్రోలియం బంకుల్లో డిస్పెన్సర్లు
 సొంత బంకుల ఏర్పాటుకూ చర్యలు
 ఎల్‌ఎన్‌జీ బస్సుల కోసం 
 వాహన సంస్థలతో చర్చలు  
 
 న్యూఢిల్లీ: ద్రవీకృత గ్యాస్ దిగుమతి సంస్థ పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ... తాజాగా రిటైల్ విభాగంలోకి ప్రవేశించనుంది. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా కనీసం 1,000 రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఎల్‌ఎన్‌జీ విక్రయించాలని యోచిస్తోంది. దీనికోసం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల (ఓఎంసీ) రిటైల్ బంకులను కూడా ఉపయోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం(బీపీసీఎల్) సంస్థలతో చర్చలు జరుపుతోంది. ప్రతిపాదనల ప్రకారం ఓఎంసీల రిటైల్ బంకుల్లో పెట్రోనెట్ తమ ఎల్‌ఎన్‌జీ డిస్పెన్సర్స్‌ను ఏర్పాటు చేయనుంది. సొంతంగా కొన్ని అవుట్‌లెట్స్‌ను నిర్వహించనుంది. చమురు శాఖ అనుమతులు వస్తే అవుట్‌లెట్స్ ద్వారా ఎల్‌ఎన్‌జీని విక్రయిం చేందుకు పెట్రోనెట్‌కు మార్గం సుగమం కానుంది. వాహనాల్లో పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తున్న దరిమిలా పెట్రోనెట్  ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే కేరళలో ఎల్‌ఎన్‌జీపై నడిచే బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
 
 టాటా, అశోక్ లేల్యాండ్‌తో చర్చలు.. : ఓఎంసీల బంకుల్లో ద్రవీకృత గ్యాస్ విక్రరుుంచాలని యోచిస్తున్న పెట్రోనెట్.. అటు ఎల్‌ఎన్‌జీతో నడిచే బస్సులను ప్రవేశపెట్టడంపై టాటా మోటార్స్, అశోక్ లేల్యాండ్ వంటి ఆటోమొబైల్ సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. దేశీయంగా ఏటా రోడ్లపైకి వచ్చే కనీసం 2,00,000 పైచిలుకు వాహనాలను ఎల్‌ఎన్‌జీతోనే నడిపే వీలుందని పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ సీఈవో ప్రభాత్ సింగ్ చెప్పారు. ఇతరత్రా ఇంధనాలతో పోలిస్తే దీనివల్ల ధరలపరంగా 30-40 శాతం మేర ప్రయోజనం ఉండగలదన్నారు. పారిస్ ఒడంబడిక ప్రకారం 2030 నాటికల్లా కార్బన్ ఉద్గారాలను 33-35% మేర తగ్గించుకునేందుకు భారత్ అంగీకరించింది. ఇంత పెద్ద ఎత్తున వాహనాలను ఎల్‌ఎన్‌జీ వైపు మళ్లిస్తే నిర్దేశిత లక్ష్యంలో కనీసం 2.5 శాతం సాధించవచ్చని ప్రభాత్ సింగ్ తెలిపారు. ప్రాథమికంగా రిటైల్ అవుట్‌లెట్స్‌లో విక్రయాల ద్వారా సుమారు 1,50,000 పైచిలుకు ఎల్‌ఎన్‌జీ ట్రక్కులకు ఇంధనం సరఫరా చేయాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఇంధన పరిమాణం 0.5-1.5 మిలియన్ టన్నుల మేర ఉంటుందని వివరించారు.
 
 నాలుగేళ్లలో గ్యాస్ వాటా 15%!
 కాలుష్యకారక వాయువులను నియంత్రించేందుకు, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు దేశీయంగా ఇంధన వినియోగంలో సుమారు 6.5 శాతంగా ఉన్న గ్యాస్ వాటాను మూడు, నాలుగేళ్లలో 15 శాతానికి పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఏటా భారత్ 78 మిలియన్ టన్నుల మేర డీజిల్‌ను వినియోగిస్తుండగా, ఇందులో ట్రక్కులు.. బస్సుల వాటా 28 మిలియన్ టన్నుల మేర ఉంటుందని పెట్రోనెట్ అంచనా. ప్రస్తుతం ఏటా 21.3 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకుంటున్న భారత్ 2022 నాటికి 50 ఎంటీపీఏకి పెంచుకోవాలని యోచిస్తోంది. అలాగే తూర్పు తీరంలో మూడు ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్‌ను నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడతో పాటు తమిళనాడులోని ఎన్నూర్, ఒరిస్సాలోని ధమ్రా పోర్టుల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది.
 
మరిన్ని వార్తలు