ఫార్మా ఎగుమతులకు వైరస్‌ దెబ్బ!

7 Apr, 2020 06:07 IST|Sakshi

ఈ ఏడాది 22 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోలేం: ఫార్మెక్సిల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ ఫార్మా ఎగుమతుల మీద కరోనా గట్టి దెబ్బే వేసింది. కేంద్రం కొన్ని రకాల ఔషధాల ఎగుమతుల మీద నియంత్రణ పెట్టడం, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశీయ ఫార్మా పరిశ్రమ 22 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోలేదని ఫార్మాసూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌(ఫార్మెక్సిల్‌) తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 19.14 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని.. 2020 ఆర్ధిక సంవత్సరంలో 22 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేశామని ఫార్మెక్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు.

గతేడాది మార్చి ఒక్క నెలలోనే 2.1 బిలియన్‌ డాలర్ల ఫార్మా ఎగుమతులు జరిగాయన్నారు. 2017–18లో ఫార్మా ఎగుమతులు 17.28 బిలియన్‌ డాలర్లు. పారాసిటమల్, హైడ్రాక్సిక్లోరోక్విన్‌ వంటి కరోనా నియంత్రణలో వినియోగించే ఔషదాల ఎగమతుల మీద కేంద్రం నియంత్రణ విధించిన సంగతి తెలిసిందే. ఫార్మా ఎగుమతుల్లో వీటి వాటా 600 మిలియన్‌ డాలర్లుంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 18.74 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను సాధించామని తెలిపారు.

మరిన్ని వార్తలు