వహ్వా.. ఫార్మా షేర్ల పరుగు

29 May, 2020 13:20 IST|Sakshi

ఎన్‌ఎస్‌ఈ ఫార్మా ఇండెక్స్‌ 2 శాతం ప్లస్‌

సొలారా యాక్టివ్‌, ఇండొకొ, ఐవోఎల్‌ జూమ్‌

52 వారాల గరిష్టానికి సిప్లా, అరబిందో 

స్టాక్‌ మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. అయితే ఫార్మా రంగ కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్‌ పెరిగింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగ ఇండెక్స్‌ 2.2 శాతం ఎగసింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు షేర్లు 2-15 శాతం మధ్య దూసుకెళ్లాయి. కోవిడ్‌-19 దెబ్బకు పలు రంగాలు కుదేలైనప్పటికీ ఇటీవల ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు పెరుగుతున్న విషయం విదితమే. ప్రధానంగా అమెరికాసహా పలు దేశాలు కోవిడ్‌-19 చికిత్సకు వినియోగిస్తున్న ఔషధాల సరఫరాకు దేశీ కంపెనీలపై ఆధారపడుతున్నాయి. ఇందుకు వీలుగా దేశీ కంపెనీలకు యూఎస్‌ఎఫ్‌డీఏ త్వరితగతిన అనుమతులు సైతం మంజూరు చేస్తోంది. దీనికితోడు వ్యాక్సిన్‌ తయారీలో సైతం దేశీ కంపెనీలు భాగస్వాములుగా మారుతున్నాయి. ఇలాంటి పలు సానుకూల అంశాలు ఇటీవల ఫార్మా రంగానికి జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..

గ్లెన్‌మార్క్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈ ఫార్మా ఇండెక్స్‌లో భాగమైన గ్లెన్‌మార్క్‌, బయోకాన్‌, దివీస్‌ ల్యాబ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో, కేడిలా హెల్త్‌కేర్‌, సిప్లా 4-2.2.3 శాతం మధ్య ఎగశాయి. తొలుత ఒక దశలో సిప్లా 4 శాతం జంప్‌చేయడం ద్వారా రూ. 651కు చేరింది. ఇదే విధంగా అరబిందో ఫార్మా 4 శాతం ఎగసి రూ. 742ను తాకింది. ఇవి 52 వారాల గరిష్టాలుకాగా.. మిడ్‌ క్యాప్స్‌లో సొలారా యాక్టివ్‌ ఫార్మా 7 శాతం పెరిగి రూ. 506 వద్ద, ఇండొకొ రెమిడీస్‌ 4 శాతం పుంజుకుని రూ. 214 వద్ద, ఐవోఎల్‌ కెమ్‌ అండ్‌ ఫార్మా 3.5 శాతం లాభంతో రూ. 383 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక టొరంట్‌ ఫార్మా 2.5 శాతం బలపడి రూ. 2415కు చేరగా.. జేబీ కెమ్‌ 3 శాతం ఎగసి రూ. 665ను తాకింది. ఇతర కౌంటర్లలో ఎస్‌ఎంఎస్‌ ఫార్మా 11 శాతం దూసుకెళ్లి రూ. 41 వద్ద కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు