న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొత్త కార్యదర్శిగా పి.కె.సింగ్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా సీసీఐకి ఆయన న్యాయపరమైన అంశాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. కార్యదర్శి పోస్టులో నియామకం కోసం సీసీఐ సెప్టెంబర్లో దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, సీసీఐకి అయిదేళ్ల పాటు సలహాదారుగా అనుభవమున్న వారిని కూడా ఎంపిక చేయొచ్చన్న నిబంధన మేరకు సింగ్ను నియమించినట్లు సంస్థ తెలిపింది. గుత్తాధిపత్య ధోరణులు, నిర్బంధ వాణిజ్య విధానాల నివారణ కమిషన్ స్థానంలో 2003లో సీసీఐ ఏర్పాటైంది. వ్యాపార రంగం లో పోటీ సంస్థలను దెబ్బతీసే ధోరణులకు చెక్ చెప్పేందుకు, విలీనాలు.. కొనుగోళ్ల డీల్స్ను నియంత్రించేందుకు సీసీఐ ఏర్పాటైంది.