-

బీఎస్‌ఈలో స్టార్టప్‌ల కోసం వేదిక

26 Jun, 2018 00:25 IST|Sakshi
బీఎస్‌ఈ స్టార్టప్‌ ప్లాట్‌ఫామ్‌ గురించి తెలుసుకుంటున్న బ్రిటన్‌ ఆర్థికమంత్రి ఫిలిప్‌ హామండ్‌

వచ్చే నెల 9న ప్రారంభం 

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లలో లిస్టింగ్‌ దిశగా స్టార్టప్‌లను ఆకర్షించేందుకు బీఎస్‌ఈ వచ్చే నెల 9న ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనుంది. ఐటీ, ఐటీఈఎస్, బయో టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్, 3డీ ప్రింటింగ్, స్పేస్‌ టెక్నాలజీ, ఈ కామర్స్‌ కంపెనీల లిస్టింగ్‌కు ఈ వేదిక ఉపయోగపడనుంది. అలాగే, హైటెక్‌ డిఫెన్స్, డ్రోన్లు, నానో టెక్నాలజీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డేటా, వర్చువల్‌ రియాలిటీ, ఈ గేమింగ్, రోబోటిక్స్, జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ తదితర రంగాల్లోని కంపెనీల లిస్టింగ్‌కూ ఈ ప్లాట్‌ఫామ్‌ సాయపడనుంది. బీఎస్‌ఈ ఇప్పటికే స్మాల్, మీడియం ఎంటర్‌ ప్రైజెస్‌ (ఎస్‌ఎంఈ) పేరుతో చిన్న, మధ్య స్థాయి కంపెనీల లిస్టింగ్‌ కోసమని ఓ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తోంది.

స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఎస్‌ఎంఈలోనే వాటికి ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నట్టు బీఎస్‌ఈ తెలిపింది. జూలై 9న దీన్ని ఆరంభించనున్నట్టు ప్రకటించింది. కనీస మూల ధనం రూ.కోటిగా ఉండాలన్న నిబంధనను ఖరారు చేసింది. ‘‘లిస్టింగ్‌కు ముసాయిదా పత్రాలు దాఖలు చేసే నాటికి కంపెనీ ప్రారంభమై మూడేళ్లు అయి ఉండాలి. అలాగే, సానుకూల నెట్‌వర్త్‌ కూడా ఉండాలి. పత్రాలు దాఖలు చేసే నాటికి కంపెనీలో క్యూఐబీ లేదా ఏంజెల్‌ ఇన్వెస్టర్లకు వాటాలు ఉండాలి. ఈ పెట్టుబడి కనీసం రూ.కోటి ఉండాలి’’ అని బీఎస్‌ఈ తన ప్రకటనలో పేర్కొంది. అలాగే, దివాలా పరిష్కార ప్రక్రియ కింద ఎన్‌సీఎల్‌టీకి నివేదించి ఉండరాదని బీఎస్‌ఈ స్పష్టం చేసింది.    

మరిన్ని వార్తలు