12వేల పేజీలతో ఈడీ తొలి చార్జిషీటు

24 May, 2018 17:11 IST|Sakshi
పీఎన్‌బీ - నీరవ్‌ మోదీ స్కాం (ఫైల్‌ ఫోటో)

ముంబై : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మూడు నెలల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గురువారం తన తొలి చార్జిషీటును దాఖలు చేసింది. నీరవ్‌ మోదీ, ఆయన సన్నిహితులపై తాము తొలి చార్జిషీటు దాఖలు చేస్తున్నామని ఈడీ అధికారులు పేర్కొన్నారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం పలు సెక్షన్ల కింద 12వేల పేజీల చార్జిషీటును దాఖలు చేసి స్పెషల్‌ కోర్టు ముందుకు తీసుకొచ్చినట్టు తెలిపారు. నీరవ్‌ మోదీ మేనమామ మెహుల్‌ చౌక్సి, ఆయన వ్యాపారాలకు వ్యతిరేకంగా కూడా ఏజెన్సీ రెండో చార్జిషీటు దాఖలు చేయబోతోంది. 

ఈ చార్జిషీటులో కేసు ప్రారంభమైనప్పటి నుంచి మోదీకి, ఆయన అసోసియేట్స్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని అటాచ్‌మెంట్ల వివరాలను పేర్కొంది. ఈ నెల మొదట్లో సీబీఐ సైతం పీఎన్‌బీ కుంభకోణ కేసులో రెండు ఛార్జ్‌షీట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.13వేల కోట్లకు పైగా పీఎన్‌బీలో వీరు కుంభకోణానికి పాల్పడినట్టు తెలిసింది. కొందరు బ్యాంకు ఉద్యోగుల సాయంతో వీరు ఈ కుంభకోణం చేశారు. పీఎన్‌బీ ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే వారు దేశం విడిచి పారిపోయారు. ఇటు విచారణకు సైతం సహకరించడం లేదు. ఈ కేసులో ఈడీ మనీ లాండరింగ్‌ విషయాలపై ఎక్కువగా దృష్టిసారించిందని సీనియర్‌ అధికారులు చెప్పారు.   

మరిన్ని వార్తలు