పీఎన్‌బీ లాభం 12% వృద్ధి

3 Aug, 2017 00:50 IST|Sakshi
పీఎన్‌బీ లాభం 12% వృద్ధి

క్యూ1లో రూ.343 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు జూన్‌ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 12 శాతం వృద్ధితో రూ.343 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ.14,468 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.306 కోట్లు, ఆదాయం రూ.13,475 కోట్లుగా ఉంది. ఆస్తుల నాణ్యత సైతం కొద్దిగా మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 13.75 శాతం నుంచి 13.66 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏలు 9.16 శాతం నుంచి 8.67 శాతానికి దిగివచ్చాయి.

 దీంతో ఎన్‌పీఏలకు చేసిన కేటాయింపులు 19 శాతం తగ్గి రూ.2,559 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఎన్‌పీఏలకు కేటాయింపులు రూ.3,165 కోట్లు కావడం గమనార్హం. అయితే, మార్చి క్వార్టర్‌లో ఉన్న స్థూల ఎన్‌పీఏలు 12.53 శాతం కంటే పెరిగినట్టు తెలుస్తోంది. మెరుగైన ఫలితాలతో పీఎన్‌బీ స్టాక్‌ ధర బీఎస్‌ఈలో ఒక శాతం పెరిగి రూ.158.90 వద్ద క్లోజయింది.

మరిన్ని వార్తలు