బీమా పాలసీల విక్రయానికి ఐఆర్డీఏఐ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: తపాలా శాఖకు చెందిన పోస్ట్మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవక్లు త్వరలో బీమా పాలసీ విక్రయదారుల అవతారం ఎత్తనున్నారు. వీరిని పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్గా (విక్రయదారులు) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) ప్రతిపాదించవచ్చని ఐఆర్డీఏఐ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. వీటి ప్రకారం.. తపాలా శాఖ పోస్ట్మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవక్ల జాబితాను ఐఆర్డీఏఐకు పంపి అనుమతి కోరాల్సి ఉంటుంది. ప్రధానంగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని, పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు విస్తరించని ప్రాంతాల్లో (మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు) వీరు బీమా విస్తరణకు తోడ్పడతారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఒకటికి మించిన బీమా కంపెనీలతో వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుని, పోస్ట్మ్యాన్లు, డాక్ సేవక్ల ద్వారా పాలసీల విక్రయాలను చేపట్టవచ్చు.