పెట్రో వాత: దీర్ఘకాల పరిష్కారం త్వరలో

2 Jun, 2018 20:42 IST|Sakshi
ప్రకాష్‌ జవదేకర్‌

కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌

పుణె : పెట్రోల్‌, డిజిల్‌ ధరలపై దీర్ఘకాలిక పరిష్కారం కోసం​ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మానవ వనురుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. శనివారం పుణెలో విలేకరులతో మాట్లాడుతూ.. ధరలు పెరగడంలో రాష్ట్రాలకు కూడా వాటా ఉందని, వారు కూడా పన్నులు విధిస్తున్నారన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసొస్తేనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందన్నారు.  గత యూపీఎ ప్రభుత్వ హయాంలో  పెట్రోల్‌ ధరలు నియంత్రణ తప్పాయని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ అయిల్‌ ధరలు పెరగడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

గతేడాది నుంచి ఆయిల్‌ కంపెనీలు రోజువారి ధరల సవరణ చేపట్టిన విషయం తెలిసిందే. గత రెండు వారాలుగా పెట్రోల్‌, డిజిల్‌ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.  అంతర్జాతీయంగా ఆయిల్‌ కంపెనీలు పెంచేటప్పుడు భారీగా పెంచడం,  తగ్గించేటప్పుడు మాత్రం పైసల చొప్పున పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించడంపై  పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు శనివారం మరో 9 పైసలు  తగ్గాయి.  దీంతో  పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 20 పైసలు ధర తగ్గింది. ఇది ఇలా ఉంటే  రికార్డ్‌ స్థాయిల్లో ఉన్న లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కేవలం పైసల్లో తగ్గించడంతో పండుగ చేసుకుంటామని సోషల్‌ మీడియా వేదికగా వాహనదారులు సెటైర్లు  వేస్తున్నారు.

మరిన్ని వార్తలు