ప్రైమరీ మార్కెట్‌కు మళ్లీ కళ

3 Apr, 2014 01:43 IST|Sakshi
ప్రైమరీ మార్కెట్‌కు మళ్లీ కళ

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్:   సెకండరీ మార్కెట్  జోరు ప్రైమరీ మార్కెట్లో కన్పిస్తుందా? నిధుల్లేక నీరసపడ్డ భారీ ప్రాజెక్టులకు మళ్లీ చలనం రానుందా? ఇన్వెస్టర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇష్యూ మార్కెట్ మళ్లీ పుంజుకోనుందా?  బుల్ మార్కెట్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు తాజా మార్కెట్లో  ప్రస్పుటంగా కనిపిస్తుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) భారత్‌లో భారీగా నిధులు కుమ్మరిస్తున్నారు. దీంతో  సెకండరీ మార్కెట్లో అనూహ్యంగా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఐతే రిటైల్ ఇన్వెస్టర్ మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకా తటపటాయిస్తూనే ఉన్నాడు.

 కంపెనీ యాజమాన్యాలు కూడా మార్కెట్ గమనాన్ని అంచనా వేయలేకపోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన బీఎస్‌సీపీఎల్ (బి. శీనయ్‌య అండ్‌కో) మార్కెట్ బాగా లేదని సెబీలో దాఖలు చేసిన రెడ్‌హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఉపసంహరించుకోగా జీఎంఆర్ ఎనర్జీ తాజాగా సెబీలో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.  భిన్న  వైరుధ్యాల నేపథ్యంలో  గత ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న ప్రైమరీ మార్కెట్‌పై మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయాలు

ఇవి....
 అరుణ్ కేజ్రీవాల్, కేజ్రీవాల్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ...
 ‘‘గత  రెండేళ్లుగా ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సిన క్యాపిటల్ ఫార్మేషన్ (మూలధన నిర్మితి) దాదాపు శూన్యం.  భారీ ప్రాజెక్టులు (రూ.1,000 కోట్లకు పైబడ్డవి) ఇప్పట్లో మార్కెట్‌కు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. అయితే చిన్న మధ్య తరహా కంపెనీలు (ఎస్‌ఎంఈ సెక్టార్) ఎన్నికల తర్వాత మార్కెట్లో పోటెత్తనున్నాయి. వంద కోట్ల మూలధన పరిమితికి మించని ఇష్యూలు కనీసం వంద కంపెనీల మేర మార్కెట్‌ను తాకనున్నాయి.  నిధుల దాహంతో పరితపిస్తున్న కంపెనీలు ఇన్వెస్టర్లకు ప్రైమరీ మార్కెట్లో మంచి పెట్టుబడి అవకాశాల్ని కలిగించనున్నాయి. ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వ కార్యాచరణపై ఇష్యూ జారీ ఆధారపడి ఉంటుంది.

 శైలేష్, జేఎం ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషనల్ సెక్యూరిటీస్...
 ‘‘భారీ ఈక్విటీలతో వచ్చే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్ రంగాల్లోని కంపెనీలు మార్కెట్లో మదుపరుల నుంచి సరైన ఆదరణ పొందలేకపోతున్నాయి. ఉదాహరణకు ఇటీవల హైదరాబాద్‌కు చెందిన బీఎస్‌సీపీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రూ. 650 కోట్ల నిధుల సమీకరణకు సెబీ  వద్ద రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అయితే ప్రైమరీ మార్కెట్లో స్తబ్దత నెలకొనడంతో కంపెనీ యాజమాన్యం ప్రాస్పెక్టస్‌ను ఉపసంహరించుకుంది. దీనికి జేఎం ఫైనాన్షియల్ బుక్న్న్రింగ్ లీడ్‌మేనేజర్‌గా వ్యవహరించింది. ఎన్నికల తర్వాత స్థిర ప్రభుత్వం ఏర్పడితే ప్రైమరీ మార్కెట్ పుంజుకోవచ్చన్నది నా అభిప్రాయం.’’

 డాక్టర్ వీవీఎల్‌ఎన్ శాస్త్రి, ఫస్ట్‌కాల్ ఈక్విటీ రీసెర్చ్..
 ‘‘ఎన్నికల తర్వాత ప్రైమరీ పుంజుకోనుంది. మర్చంట్ బ్యాంకులు కళకళలాడుతున్నాయి.  రానున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని  భారీగా రిక్రూమెంట్లు కూడా  జరుపుతున్నాయి. కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో  సెబీ మార్గదర్శకాలు మరింత కఠినతరం కావడంతో నాణ్యమైన ఇష్యూలే మార్కెట్లోకి రానున్నాయి.   హైనెట్‌వర్త్ ఇండివిజువల్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు, బులియన్‌లో పెట్టుబడి పెట్టే వాళ్లు క్రమంగా వారి ఎక్స్‌పోజర్ తగ్గించుకుంటున్నారు. ప్రైమరీలో లిస్టింగ్ ప్రాఫిట్ చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. భారీ ఇష్యూలకన్నా ఎస్‌ఎంఈ ఇష్యూలపై దృష్టి పెడితే బాగుంటుంది’’.
 ఇకపై పబ్లిక్ ఆఫర్ల జోరు : ప్రైమ్ డేటాబేస్
 
 న్యూఢిల్లీ: గడచిన ఏడాది నిరుత్సాహపరచినప్పటికీ 2014-15లో పబ్లిక్ ఇష్యూలకు జోష్‌రానున్నట్లు ప్రైమ్ డేటాబేస్ అంచనా వేసింది. 2013-14లో దేశీ కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 1,205 కోట్లను మాత్రమే సమీకరించగలిగాయని తెలిపింది. ఐపీవోల ద్వారా 2012-13లో కంపెనీలు సమీకరించిన రూ. 6,289 కోట్లతో పోలిస్తే ఇవి 81% క్షీణతగా తెలిపింది. ప్రస్తుతం బుల్ ధోరణి కొనసాగుతున్న నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూలకు డిమాండ్ పుంజుకుంటుందని  ప్రైమ్ డేటాబేస్ ఎండీ పృథ్వీ చెప్పారు.

 వెరసి సుమారు 900 కంపెనీలు ఐపీవోలను చేపట్టేందుకు ఆసక్తిని ప్రదర్శించాయని తెలిపారు. ప్రస్తుతం 14 కంపెనీలు రూ. 2,796 కోట్లను సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి కోసం చూస్తున్నాయని తెలిపారు. మరో నాలుగు కంపెనీలు రూ. 2,700 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(వైజాగ్ స్టీల్), హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్‌ఏఎల్), మహానగర్ గ్యాస్, కొచిన్ షిప్‌యార్డ్స్ తదితర అన్‌లిస్టెడ్ ప్రభుత్వ సంస్థలు ఐపీవోలు చే పట్టే అవకాశముందని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు