22శాతం క్షీణించిన హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం

25 May, 2020 15:42 IST|Sakshi

ప్రతి షేరుపై రూ.21ల డివిడెండ్‌ ప్రకటన

హౌసింగ్ డెవెలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌డీఎఫ్‌సీ) సోమవారం గత ఆర్థిక సంవత్సరపు మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదిక మార్చి 31తో ముగిసిన క్వార్టర్‌లో నికరలాభం 22 శాతం క్షీణించి రూ.2,233 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.2,862 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో డివిడెండ్ ఆదాయం కేవలం రూ.2 కోట్ల కావడంతో లాభం పడిపోయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.537 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో పెట్టుబడుల అమ్మకంపై లాభం రూ.2 కోట్లు కాగా, అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ.321 కోట్లుగా ఉంది. కంపెనీ బోర్డు ఆర్థిక సంవత్సరం 2020కు సంబంధించి ఒక్కో షేరుకు రూ .21 డివిడెండ్ ప్రకటించింది. వార్షిక ప్రాతిపదిక నికర వడ్డీ ఆదాయం 17శాతం పెరిగి రూ.3,780 కోట్లగా నమోదైంది. అంతకు ఇదే నాలుగో క్వార్టర్‌లో ఎన్‌ఐఐ రూ.3,238 కోట్లుగా నమోదైంది.  నికర వడ్డీ మార్జిన్‌ 3.4శాతం నుంచి 3.3శాతానికి దిగివచ్చింది. రికవరీ అంశంపై కంపెనీ స్పందిస్తూ మార్చి చివరి భాగంలో దెబ్బతిన్నాయని, దీని ఫలితంగా వ్యక్తిగత నిరర్ధక రుణాలు పెరిగాయని తెలిపింది. 

మరిన్ని వార్తలు