నష్టాల మార్కెట్లోనూ రాణిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు

4 Jun, 2020 10:27 IST|Sakshi

2.50శాతం లాభపడ్డ నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్

నష్టాల మార్కెట్‌ ట్రేడింగ్‌లోనూ గురువారం ఉదయం ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ దాదాపు 2.50శాతం వరకు లాభపడింది. 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్‌లో  ప్రకటించిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ప్రైవేటీకరణకు కేంద్రం పనులు ప్రారంభించింది.  ఈ ప్రక్రియలో భాగంగా నీతి ఆయోగ్‌ సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఎంపిక చేసిన బృందం విలీన ప్రతిపాదనపై చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

బ్యాంకుల విలీన వార్తలు తెరపైకి రావడంతో మార్కెట్‌ ప్రారంభం నుంచే ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో 2.50శాతం లాభపడి 1316.05 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు ఇండెక్స్‌ మునుపటి ముగింపుతో పోలిస్తే 1శాతం లాభంతో 1316.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఈ పీఎస్‌యూ రంగానికి చెందిన పంజాజ్‌సింధ్‌ బ్యాంక్‌ షేరు 9.50శాతల లాభపడింది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 8.50శాతం పెరిగింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియా బ్యాంక్‌ , సెంట్రల్‌బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 1శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. జమ్మూ&కాశ్మీర్‌, ఎస్‌బీఐ షేర్లు అరశాతం నష్టపోయాయి.

>
మరిన్ని వార్తలు