శిఖాశర్మ స్థానంలో ప్రభుత్వ బ్యాంకర్‌

19 Jun, 2018 19:17 IST|Sakshi
యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవో శిఖా శర్మ(ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : పీఎస్‌ జయకుమార్‌‌.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌. ఈయనే ఇక యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవోగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవో శిఖా శర్మ స్థానంలో, జయశంకర్‌ ఆ పదవిని అలంకరించబోతున్నారని తెలుస్తోంది. కొత్త సీఈవోను వెతుకులాడేందుకు బ్యాంక్‌ అపాయింట్స్‌మెంట్‌ కమిటీ ఈ ఏడాది ప్రారంభంలోనే ఇగోన్ జెహెండర్‌ను నియమించింది. జెహెండర్‌ ఆధ్వర్యంలోని సెర్చ్‌ ప్యానల్‌, జయకుమార్‌ను పరిగణలోకి తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జయకుమార్‌ అంతకముందు సిటీబ్యాంకర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీఓబీ సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాదితో ఆయన పదవీ కాలం బీఓబీలో ముగియబోతోంది. కాగ, శిఖా శర్మ ఈ ఏడాది చివరికి శాశ్వతంగా తన పదవి నుంచి దిగిపోబోతున్నారు. 

2018 సెప్టెంబర్‌ వరకు యాక్సిస్‌ బ్యాంక్‌ కొత్త సీఈవోపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జయకుమార్‌తో పాటు ఈ పదవికి బ్యాంక్‌ డిప్యూటీ ఎండీ వీ శ్రీనివాసన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ ఆనంద్‌లు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను, బోర్డు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయనుంది. కొన్ని వారాల్లో ఈ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఒక్కసారి సీఈవో ఎవరో తేల్చేశాక, షేర్‌హోల్డర్స్‌, ఆర్‌బీఐ నుంచి బ్యాంక్‌ ఆమోదం పొందుతుంది. కాగ, గతేడాది జూలైలోనే యాక్సిస్‌ బ్యాంక్‌, శిఖా శర్మను మరోసారి సీఈవో, ఎండీగా నియమించింది. 2018 జూన్‌ నుంచి మూడేళ్ల పాటు ఆమెనే కొనసాగనున్నారని పేర్కొంది. అయితే దీనిపై ఆర్‌బీఐ అభ్యంతరం తెలిపింది. బ్యాంక్‌ ప్రదర్శన, ఆస్తుల నాణ్యత బట్టి, మరోసారి యాక్సిస్‌ బ్యాంక్‌ బోర్డు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలిపింది. అయితే శిఖా శర్మనే తన నాలుగో టర్మ్‌ పదవి కాలాన్ని 2021 మే వరకు కాకుండా.. ఈ ఏడాది చివరికి ముగించేయాలని కోరినట్టు బ్యాంక్‌ బోర్డు, ఆర్‌బీఐకి లేఖ తెలిపింది. దీంతో ఈ ఏడాది చివరితోనే శిఖాశర్మ తన పదవి నుంచి దిగిపోబోతున్నారు.  

మరిన్ని వార్తలు