అక్టోబర్‌లో రుణాల పంపిణీ రూ.2.5 లక్షల కోట్లు

22 Nov, 2019 06:35 IST|Sakshi

ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో భాగంగా అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.2.5 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. నిదానించిన ఆర్థిక వ్యవస్థకు, వినియోగానికి ప్రేరణనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు.. పీఎస్‌బీలు దసరా, దీపావళి పండుగల సమయంలో 374 జిల్లాల పరిధిలో రుణ మేళాలను నిర్వహించిన విషయం గమనార్హం. ‘‘ఈ సందర్భంగా పీఎస్‌బీలు రూ.2,52,589 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. ఇందులో రూ.1,05,599 కోట్లు నూతన టర్మ్‌ రుణాలు కాగా, రూ.46,800 కోట్లు మూలధన రుణాలు’’అని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) కూడా రూ.19,627 కోట్లను సమకూర్చాయి. బ్యాంకుల వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, రుణ డిమాండ్లను అవి తీర్చే స్థితిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు.  

అక్టోబర్‌లో ఎవరికి ఎంత మేర..
♦ కార్పొరేట్లకు రూ.1.22 లక్షల కోట్ల రుణాలు
♦ వ్యవసాయ రుణాలు రూ.40,504 కోట్లు
♦ ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.37,210 కోట్లు
♦ గృహ రుణాలు రూ.12,166 కోట్లు
♦ వాహన రుణాలు రూ.7,058 కోట్లు
♦ ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి రూ.19,627 కోట్లు 

మరిన్ని వార్తలు