పీవీఆర్‌ స్క్రీన్ల వేట

27 Jan, 2017 00:51 IST|Sakshi
పీవీఆర్‌ స్క్రీన్ల వేట

న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ చెయిన్‌ ఆపరేటర్, పీవీఆర్‌ మరిన్ని ‘స్క్రీన్ల’ను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 30 స్క్రీన్లను కొనుగోలు చేయనున్నామని పీవీఆర్‌ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 70–80 స్క్రీన్లను కొనుగోలు చేస్తామని కంపెనీ జాయింట్‌ ఎండీ సంజీవ్‌ కుమార్‌ బిజ్లి చెప్పారు. కొనుగోలు చేయడానికి పలు స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని, కానీ తమకు తగినవి మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటున్నామని, ఈ విషయమై కసరత్తు జరుగుతోందని వివరించారు.

గత ఏడాది పీవీఆర్‌ కంపెనీ డీఎల్‌ఎఫ్‌ నుంచి 32 స్క్రీన్ల డీటీ సినిమాస్‌ను రూ.433 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం పీవీఆర్‌ సంస్థ 48 నగరాల్లో 122 ప్రోపర్టీల్లో 562 స్క్రీన్లను నిర్వహిస్తోంది. కాగా ఇటీవలనే పీవీఆర్‌లో 14 శాతం వాటాను వార్‌బర్గ్‌ పిన్‌కస్‌ అనే ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ రూ.820 కోట్లకు కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు